హుగ్లీలో ఘర్షణలు..144 సెక్షన్ విధింపు

నవతెలంగాణ – హుగ్లీ: పశ్చిమబెంగాల్‌ లోని హుగ్లీ జిల్లాలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య శుక్రవారంనాడు ఘర్షణలు చెలరేగాయి. దీంతో జిల్లాలో 144 సెక్షన్ విధించింది. అదనపు బలగాలను మోహరించారు. ఖనాకుల్ నెం.1 పంచాయతీ బోర్డు ఏర్పాటుపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ తెలెత్తిందని, ఒకరిపై మరొకరు బాంబులు, రాళ్లు రువ్వుకున్నారని, పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి జరిపారని చెబుతున్నారు. ఈ ఘర్షణలలో పలు కార్లు, ఆస్తులు ధ్వంసమయ్యాయి. పంచాయతీ బోర్డు ఏర్పాటు సందర్భంగా ఇరు పార్టీల మధ్య గొడవ మొదలైందని, పరిస్థితిని అదుపు చేయడానికి బదులు పోలీసులు నిస్సహాయంగా చూస్తుండిపోయారని పలువురు ఆరోపించారు. నిజానికి ఖనాకుల్ నెంబర్ 1 పంచాయతీ బోర్డును టీఎంసీ ఏర్పాటు చేసింది. ఇక్కడ 17 స్థానాలకు 8 సీట్లు బీజేపీ, మరో 8 సీట్లు టీఎంసీ గెలుచుకోగా, ఒక సీటు సీపీఎం అభ్యర్థి గెలుచుకున్నాడు. సీపీఎం అభ్యర్థి మద్దతుతో టీఎంసీ పంచాయతీ బోర్డును ఏర్పాటు చేసింది.

Spread the love