నవతెలంగాణ – కోల్కతా: రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరన్ సింగ్ తమను లైంగికంగా వేధింపులకు గురిచేశాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారత మహిళా రెజ్లర్లు గత కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జి రెజ్లర్లకు తన మద్దతు తెలిపారు. కోల్కతాలోని మమతాబెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించాయి. కోల్కతాలోని హజ్రా నుంచి రవీంద్ర సదన్ వరకు ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా మమతాబెనర్జి మాట్లాడుతూ.. రెజ్లర్లు మన దేశానికి గర్వ కారణమని, వారు రోడ్లపైకి వచ్చి న్యాయం కోసం పోరాడుతున్నా కేంద్ర సర్కారు పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. రెజ్లర్లకు న్యాయం జరిగేవరకు తాము అండగా ఉంటామని ఆమె ప్రకటించారు.