పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత

నవతెలంగాణ-హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల వేళ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోంది. అధికార పార్టీ నేతలు భారీగా మద్యం నిల్వ చేసినట్టు ఫిర్యాదులు అందడంతో శుక్రవారం రాత్రి ఎస్‌ఈబీ అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. నాలుగు ప్రాంతాల్లో అక్రమ మద్యం నిల్వలు గుర్తించారు. పట్టణంలోని జగ్గయ్యచెరువు, సాలిపేట, వైఎస్‌ఆర్‌ గార్డెన్‌, కుమారపురం కాలనీల్లోని ఇళ్లలో నిల్వ చేసిన రూ.80 లక్షల విలువైన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక ఇంట్లోనే 2,560 లీటర్లకు పైగా మద్యం పట్టుబడింది. వేల కొద్దీ రాయల్‌ బ్లూ బ్రాండ్‌, గోవా కిక్‌ మద్యం సీసాలు బస్తాల్లో నిల్వ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఎస్‌ఈబీ అధికారి మహబూబ్‌ అలీ ఆధ్వర్యంలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటంతో పిఠాపురం నియోజకవర్గం ప్రత్యేకతను సంతరించుకుంది. దీంతో ఎన్డీయే కూటమి, వైకాపా మధ్య గట్టిపోటీ నెలకొంది. వైకాపా నేతలు పెద్ద ఎత్తున మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నారని జనసైనికులు ఆరోపిస్తున్నారు.

Spread the love