ముగిసిన రెండో దశ ఎన్నికల పోలింగ్

నవతెలంగాణ-హైదరాబాద్ : దేశంలో సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నేడు రెండో దశలో భాగంగా 13 రాష్ట్రాల్లోని 88 ఎంపీ స్థానాల్లో పోలింగ్ జరిగింది. కొద్దిసేపటి కిందట పోలింగ్ ముగిసింది. సాయంత్రం 7 గంటల సమయానికి 60.96 శాతం ఓటింగ్ నమోదైనట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. త్రిపురలో ఒక లోక్ స్థానానికి ఎన్నికలు జరగ్గా, అత్యధికంగా 77.93 శాతం ఓటింగ్ నమోదైంది. చత్తీస్ గఢ్ లో 72.13 శాతం, పశ్చిమ బెంగాల్ లో 71.84 శాతం, మహారాష్ట్రలో 53.51 శాతం ఓటింగ్ నమోదైంది. బీహార్ లో తొలి దశ కంటే రెండో దశలో అత్యధిక పోలింగ్ నమోదైంది. ఇవాళ బీహార్ లో 5 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా, 53.03 శాతం పోలింగ్ జరిగింది. ఉత్తరప్రదేశ్ లో సాయంత్రం 5 గంటల సమయానికి 52.74 శాతం ఓటింగ్ నమోదైంది. రాజస్థాన్ లో 13 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగ్గా, సాయంత్రం 5 గంటల సమయానికి 59.19 శాతం ఓటింగ్ జరిగింది. కర్ణాటకలో 14 స్థానాలకు పోలింగ్ జరగ్గా, సాయంత్రం 5 గంటల వరకు 63.9 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక, రెండో దశలో కేరళలో అత్యధికంగా 20 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కేరళలో సాయంత్రం 6 గంటల సమయానికి 67.27 శాతం పోలింగ్ జరిగినట్టు గుర్తించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వాయనాడ్ ఎంపీ స్థానం కూడా రెండో దశలో పోలింగ్ జరుపుకుంది.

Spread the love