నవతెలంగాణ ఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. శుక్రవారం సాయంత్రం బంజారాహిల్స్లోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు ఈరోజు ఉదయం సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరు పర్చారు. సుదీర్ఘ వాదనల తర్వాత ఈ నెల 23 వరకు కవితను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. 23న తిరిగి కోర్టులో హాజరు పర్చాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆమె తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించగా.. ఈడీ తరఫున ఎన్.కె మట్టా, జోయబ్ హుసేన్ వాదించారు.