నేనే చిన్నపీట మీద కూర్చున్నా: డిప్యూటీ సీఎం భట్టి

నవతెలంగాణ హైదరాబాద్‌: యాదాద్రి ఆలయంలో తాను కావాలనే చిన్నపీట మీద కూర్చున్నానని, దాన్ని సామాజిక మాధ్యమాల్లో అర్థంపర్థం లేకుండా ట్రోల్‌ చేస్తున్నారని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బంజారాహిల్స్‌లో నిర్వహించిన సింగరేణి అతిథిగృహ శంకుస్థాపన కార్యక్రమంలో భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదాద్రి ఘటనపై వివరణ ఇచ్చారు. ‘‘మా ప్రభుత్వం వచ్చాక మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో భాగంగా పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతం కావాలని కోరుకుంటూ యాదగిరిగుట్టలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశాం. దీనిలో భాగంగా కావాలనే చిన్నపీట మీద కూర్చున్నా. ఉపముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని శాసిస్తున్నా. మూడు శాఖలతో ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నా. ఆత్మగౌరవంతో జీవించే మనిషిని. నన్ను ఎవరూ అవమానించలేదు. అందరూ దీన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నా. సింగరేణి సంస్థను మరింత అభివృద్ధి చేస్తాం. ఈ సంస్థ ఆదాయాన్ని కార్మికులకు, రాష్ట్ర ప్రజలకే చెందేలా చూస్తాం’’అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Spread the love