నవతెలంగాణ – పరకాల
పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. శుక్రవారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్యతో కలిసి పరకాల టౌన్, పరకాల, నడికూడ, దామెర, ఆత్మకూరు మండలాలకు చెందిన 56 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించిన ఆయన, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. పరకాలలో ఇందిరా మహిళా డెయిరీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, నూతన రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ చీరలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు బీమా, సన్న వడ్లకు రూ.500 బోనస్, సన్న బియ్యం పంపిణీ, మహాలక్ష్మి పథకం, గ్యాస్ సబ్సిడీ, వడ్డీలేని రుణాలు, శ్రీనిధి రుణాలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తదితర సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని ఎమ్మెల్యే వివరించారు.



