మోసపూరిత పార్టీల మాటలు నమ్మి గోసపడొద్దు..

 – బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం..
 – గెలిచిన వెంటనే ఫాజుల్ నగర్-తుర్కాషి నగర్ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తా..
నవతెలంగాణ- వేములవాడ: ఎన్నికల సందర్భంగా మోసపూరిత మాటలు చెప్పి, అమలు కానీ హామీలు ఇచ్చే పార్టీలను నమ్మి మోసపోయి, గోసపడొద్దని బీఆర్‌ఎస్‌ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు అన్నారు. నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం వేములవాడ రూరల్ మండలం వట్టెంల, ఫాజుల్ నగర్, తుర్కాషి నగర్, నమిలిగుండు పల్లి గ్రామాల్లో జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ-రాఘవ రెడ్డి, సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డిలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చల్మెడ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్ళీ చీకటి రోజులు చూడాల్సి వస్తుందని, కాంగ్రెస్ పార్టీ 3గంటలే కరెంట్ ఇస్తామంటుందని, మరి 3గంటలు కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలో….?24గంటలు కరెంట్ ఇచ్చే బీఆర్‌ఎస్‌ పార్టీ కావాలో…? ఆలోచించుకోండని సూచించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని, రాబోయే రోజుల్లో గ్రామాలు ఇంకా అభివృద్ధి చెందాలన్నా, ప్రజల బ్రతుకులు మరాలన్నా మళ్ళీ బీఆర్‌ఎస్‌ పార్టీకే అధికారం ఇవ్వాలని సూచించారు. వేములవాడ వ్యవసాయ సహకార సంఘంలో ఒక సీజన్ లో  ఆనాడు 3వేల క్వింటాల్ ల వరి ధాన్యం పండితే, నేడు 3లక్షల క్వింటాల్లా ధాన్యం పండుతుందని, ఇది తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత అని  అన్నారు. అభివృద్ధి చేయాలనే ఆశయంతో ముందుకు వస్తున్నానని ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే వేములవాడ రూరల్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న  సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా గెలిచిన వెంటనే ఫాజుల్ నగర్-తుర్కాషి నగర్ రోడ్డుకు మొదటి ప్రాధాన్యతగా రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని, రోడ్డు పూర్తి చేసిన తర్వాతే గ్రామంలో అడుగుపెడతానని హామీ ఇచ్చారు.
మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన చల్మెడ
వేములవాడ రూరల్ మండలం నమిలి గుండు పల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మహమ్మద్ రఫీ ఇటీవల గుండెపోటుతో మృతిచెందగా విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు, జడ్పీ చైర్పర్సన్ అరుణ-రాఘవరెడ్డిలు మంగళవారం మృతుని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రెండు పర్యాయాలు గ్రామ సర్పంచ్ గా ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు ప్రజా సేవలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న రఫీ అకాల మరణం పొందటం చాలా బాధాకరమంటూ ప్రగాఢ సానుభూతి తెలిపి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతకుముందు రఫీ మృతి పట్ల గ్రామస్తులతో కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఇదిలా ఉండగా రఫీ కుటుంబ సభ్యులను ఓదార్చుతూ భావోద్వేగానికి గురైన జడ్పీ చైర్పర్సన్ అరుణ కన్నీళ్లు పెట్టుకుంది.  వారి వెంట సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు గోస్కుల రవి, సర్పంచుల ఫోరమ్ మండల అధ్యక్షుడు తిరుపతి, సెస్ డైరెక్టర్ ఆకుల దేవరాజం, ప్యాక్స్ చైర్మన్ తిరుపతి రెడ్డి,  మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాల్ రెడ్డి, మాజీ చైర్మన్ గడ్డం హన్మాండ్లు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మల్లేశం, గ్రామ సర్పంచ్ లక్ష్మీ-లక్ష్మణ్, గ్రామ శాఖ అధ్యక్షుడు గుంటి అంజయ్యలతో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Spread the love