ఎక్కువసేపు కూర్చుంటున్నారా?

ప్రస్తుతం జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారు. కానీ ఇప్పుడు శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయింది. గంటలతరబడి కూర్చొని పనిచేయాల్సి వస్తున్నది. దీంతో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అదేపనిగా ఎక్కువ సేపు కూర్చునే వారిలో చనిపోయే ప్రమాదం ఇతరులతో పోల్చితే 16శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఓ అధ్యయనం వెల్లడించింది. పరిశోధన ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
అదేపనిగా గంటలతరబడి కూర్చొని పనిచేసే వారిలో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 4,81,688 మంది వ్యక్తులపై జరిపిన అధ్యయనం తర్వాత, ఇతర వ్యక్తులతో పోలిస్తే అలాంటి వారికి హృదయ సంబంధ వ్యాధులతో మరణించే ప్రమాదం 34 శాతం ఎక్కువగా ఉందని తేలింది. ఇతర వ్యాధుల వల్ల మరణించే ప్రమాదం 16 శాతం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. పరిశోధనల ప్రకారం.. వద్ధాప్యం వరకు నడక శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. అలాకాకుండా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల బ్లడ్‌ షుగర్‌, అధిక రక్తపోటు, ఊబకాయం, నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోయే ప్రమాదం పెరుగుతుంది. ఇది కొలెస్ట్రాల్‌ సమస్యలను కలిగిస్తుంది. ఇవన్నీ కలిసి గుండె జబ్బులు, క్యాన్సర్‌ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి.
మహిళలు మరింత జాగ్రత్త..
8 గంటల కంటే ఎక్కువసేపు కూర్చునే వారి ఆరోగ్యానికి ధూమపానం చేసినంత ప్రమాదం ఉంటుందని పరిశోధనలో తేలింది. రోజంతా కూర్చొని జిమ్‌కి వెళ్లినా ఉపయోగం లేదని పరిశోధకులు చెబుతున్నారు. ఒక నివేదిక ప్రకారం, ఊబకాయం, కొలెస్ట్రాల్‌, అధిక రక్తపోటు వంటి ప్రమాదకరమైన వ్యాధులు మహిళల్లో వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఇలాంటి వారు తమ ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించి, ఎక్కువసేపు ఒకేచోట కూర్చోవద్దని సూచిస్తున్నారు.

Spread the love