ప్రయాణికులపై రవాణా ఛార్జీల భారం మోపొద్దు: భట్టి విక్రమార్క

నవతెలంగాణ హైదరాబాద్‌: ఆర్టీసీ ప్రయాణికులపై రవాణా ఛార్జీల భారం మోపకుండా సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టి, నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. సచివాలయంలో బుధవారం టీఎస్‌ఆర్టీసీపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. టీఎస్‌ఆర్టీసీ ఆర్థిక పరమైన అంశాలు, మహాలక్ష్మి పథకం అమలు తీరు, ప్రభుత్వ ఆర్థిక సాయం తదితర విషయాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సంస్థ ఉన్నతాధికారులు వివరించారు. మహాలక్ష్మి స్కీమ్‌ కింద ఇప్పటివరకు 6.50 కోట్ల మంది మహిళలు ప్రయాణాలు సాగించడం గొప్ప విషయమన్నారు.
ఈ స్కీమ్‌ను ఇలాగే ప్రశాంత వాతావరణంలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు. టీఎస్‌ఆర్టీసీకి ఆర్థిక శాఖ తరఫున పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. నిర్వహణ వ్యయం మేరకు కావాల్సిన నిధులను సంస్థకు సమకూర్చాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. సిబ్బందికి రావాల్సిన బకాయిలు, సంస్థ అప్పులు, పీఎఫ్‌, సీసీఎస్‌ ఇతర సెటిల్‌మెంట్లకు సంబంధించిన నిధులపై సమీక్షించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి రోజు సగటున 27 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని, దాదాపు రూ.10 కోట్ల విలువైన జీరో టికెట్లను జారీ చేస్తున్నామని ఆర్టీసీ ఉన్నతాధికారులు వివరించారు. ఆర్టీసీ ప్రజల సంస్థ అని.. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సంస్థను బలోపేతం చేయడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై సంస్థ ఆలోచిస్తోందని, టికెట్ ఆదాయంపైనే కాకుండా.. లాజిస్టిక్స్, కమర్షియల్, తదితర మార్గాల్లోనూ ఆదాయంపై సంస్థ దృష్టి పెట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు.

Spread the love