నవతెలంగాణ – హైదరాబాద్ : వెనిజులా భూకంప రక్షణ చర్యల్లో అద్భుతం ఆవిష్కృతమైంది. విపత్తు సంభవించి ఎనిమిది రోజులు గడిచింది. అయినా భవనం శిథిలాల కింది నుంచి ఓ వ్యక్తిని సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. అతడే 43 ఏళ్ల సెక్యూరిటీ గార్డు హెర్నాన్ అల్బెర్టో గిల్ ఫ్లోరెస్. రక్షక సిబ్బంది అతణ్ని చేరుకోగానే ఫ్లోరెస్ చెప్పిన తొలి మాట అందరినీ కంటతడి పెట్టించింది. ‘‘నేను బతికున్నానని నా భార్యకు ఇప్పుడే చెప్పొద్దు. ఒకవేళ ఏదైనా జరిగితే ఆమె మరింత బాధపడుతుంది’’ అని అతడు కోరాడు.
జూన్ 24న వరుసగా 7.2, 7.5 తీవ్రతతో భూకంపాలు రావడంతో ఏడు అంతస్తుల భవనం కూలిపోయింది. ఆ సమయంలో నైట్ షిఫ్ట్లో ఉన్న ఫ్లోరెస్ సెక్యూరిటీ క్యాబిన్లోనే చిక్కుకున్నాడు. భవనం కూలిపోయినా క్యాబిన్ పూర్తిగా ధ్వంసం కాకపోవడంతో లోపల కొద్దిపాటి గాలి చేరి అతడు ప్రాణాలతో బయటపడగలిగాడు. కోస్టారికా రెడ్క్రాస్ బృందం మొదట అతడి జాడ గుర్తించింది. టెలిస్కోప్ కెమెరాతో అతడితో మాట్లాడుతూ నీరు, ద్రవ ఆహారం అందించింది. చిలీ, అమెరికా, మెక్సికో, పోర్చుగల్, ఎల్ సాల్వెడార్, వెనిజువెలా బృందాలు కలిసి 100 గంటలకు పైగా శ్రమించాయి. మూడు మీటర్ల సొరంగం తవ్వి చివరకు అతణ్ని బయటకు తీశాయి.



