ఈజ్‌ ఆఫ్‌ జస్టిస్‌ పౌరుల హక్కు

Ease of Justice is a citizen's right– సుప్రీంకోర్టు వజ్రోత్సవంలో ప్రధాని మోడీ
– న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ప్రస్తుత రాజ్యాంగ భద్రతలు సరిపోవు : సీజేఐ డివై చంద్రచూడ్‌
– ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలని పిలుపు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సులభతరమైన న్యాయం (ఈజ్‌ ఆఫ్‌ జస్టిస్‌) ప్రతి పౌరుడి హక్కు అనీ, దీనికి సుప్రీంకోర్టు ప్రధాన మార్గంగా వ్యవహరిస్తుం దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. పాత చట్టాల నుంచి కొత్త పాలనకు ఇబ్బందులు లేకుండా ఉండాలనీ, భాగస్వాములందరి కోసం సామర్థ్యాన్ని పెంపొందించడంలో నిమగమవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. సుప్రీంకోర్టు వజ్రోత్సవాలను ప్రధాని మోడీ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ డిజిటల్‌ సుప్రీంకోర్టు నివేదికలు (డీజీ ఎస్‌సీఆర్‌), డిజిటల్‌ కోర్టులు 2.0, సుప్రీంకోర్టు కొత్త వెబ్‌సైట్‌ అనే మూడు సాంకేతిక కార్యక్రమాలను ప్రారంభించారు.
ప్రధాని మోడీ మాట్లాడుతూ కాలం చెల్లిన వలస నేర చట్టాలను రద్దు చేయడంలోనూ, భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత, భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్యా అథీనియం వంటి కొత్త చట్టాలను ప్రవేశపెట్టడంలో ప్రభుత్వం చొరవ తీసుకుందన్నారు. ఈ ముఖ్యమైన మార్పులతో దేశంలోని చట్టపరమైన, పోలీసింగ్‌, పరిశోధనాత్మక వ్యవస్థలు కొత్త శకంలోకి ప్రవేశించాయని చెప్పారు. ఇది ప్రస్తుత పరిస్థితి, ఉత్తమ అవసరాలకు అనుగుణంగా చట్టాల ఆధునీకరణకు ప్రభుత్వంతో నిరంతరం ప్రయత్నిస్తుందని తెలిపారు.
కోర్టుల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు కట్టుబడి ఉన్నాం
కోర్టుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోడీ అన్నారు. కోర్టు రికార్డుల డిజిటలైజేషన్‌, అనేక ఇతర సాంకేతిక పురోగతులను ఊహించే ఈ-కోర్టుల మిషన్‌ ప్రాజెక్ట్‌ రెండో దశ కంటే మూడో దశ నిధుల కేటాయింపు నాలుగు రెట్లు పెరిగిందని ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు భవన సముదాయం విస్తరణకు రూ.800 కోట్లకు గతవారం ఆమోదం తెలిపిన విషయాన్ని మోడీ గుర్తు చేశారు. 2014 నుంచి కోర్టుల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి తమ ప్రభుత్వం రూ.7,000 కోట్లకు పైగా ఖర్చు చేసిందన్నారు. రాబోయే 25 ఏండ్లలో దేశ భవిష్యత్తును రూపొందించడంలో సుప్రీంకోర్టు ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు. అత్యున్నత న్యాయస్థానం మొదటి మహిళా న్యాయమూర్తి అయిన ఎం ఫాతిమా బివికి మరణానంతరం పద్మభూషణ్‌ ప్రదానం చేయడం గర్వకారణమని చెప్పారు.
ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సీజేఐ చంద్రచూడ్‌ పిలుపునిచ్చారు. న్యాయస్థానాల లోపల, వెలుపల రాజ్యాంగాన్ని సమర్థించే నిబద్ధతను పునరుద్ధరించాలని కోరారు. కేసుల బ్యాక్‌లాగ్‌, కాలం చెల్లిన విధానాలు, వాయిదాల సంస్కృతితో సహా న్యాయవ్యవస్థను ప్రభావితం చేసే నిర్మాణాత్మక సమస్యలను పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. రాజ్యాంగాన్ని, చట్టాన్ని సమర్థించే ప్రధాన విధులను అత్యున్నత న్యాయస్థానం మరచిపోదని చెప్పారు. లింగం, అంగ వైకల్యం, జాతి, కులం, లైంగికతపై సామాజిక పరిస్థితుల వైఖరులను తెలుసుకోవడానికి న్యాయమూర్తులందరికీ అవగాహన కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.
న్యాయం చేయాలనే కోరికే న్యాయమూర్తులు, న్యాయవాదులను కలుపుతుంది
”ఆలోచనల విశ్లేషణను స్వీకరించే సామర్థ్యమే మన బహు స్వభావ బలం. మన కోర్టులోని విశ్లేషణ వైవిధ్యాన్ని ఒకచోట చేరుస్తుంది. అదే న్యాయస్థానం నిజమైన సామాజిక ధర్మం, సామాజిక మనస్సాక్షి. న్యాయస్థానం ఒక ఆత్మగా ఉద్భవించింది. ఇది మన ప్రజలకు న్యాయం జరగాలనే మా కోరికలో న్యాయమూర్తులు, న్యాయవాదులను కలుపుతుంది’ అన్నారు. ‘కేసుల పెండింగ్‌తో కోర్టు అపారమైన ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ప్రస్తుతం, మొత్తం 65,915 నమోదైన కేసులు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. నిర్ణయం తీసుకునే విధానంలో సమూలమైన మార్పు ఉండాలి. ప్రతి వ్యక్తి కేసులో న్యాయం జరగాలనేదే మా కోరిక” అన్నారు. వాదనల నిడివిని అరికట్టేందుకు సంస్కరణలు అవసరమని, సుదీర్ఘ వాదనలు న్యాయపరమైన ఫలితాల్లో అంతులేని జాప్యానికి దారి తీస్తాయని అన్నారు. అత్యున్నత న్యాయస్థానం విచారించే అంశాల ఎంపికకు పున్ణపరిశీలన అవసరమని ఆయన నొక్కి చెప్పారు. ఈ ఒత్తిడి సమస్యలను పరిష్కరించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. సుప్రీంకోర్టు రూపొందించిన గొప్ప న్యాయశాస్త్రం, ఈ నిర్ణయాలను రూపొందించే న్యాయమూర్తుల నైపుణ్యం పనిగా పరిగణించబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్‌ ఎకె సిక్రి, జస్టిస్‌ సంజరు కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ అజరు రస్తోగి, అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణి, సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆదిష్‌ సి అగర్వాలా పాల్గొన్నారు.
విలువలు, ఆధునికత కలయికతో చట్టాలు
‘నేటి ఆర్థిక విధానాలు రేపటి చురుకైన దేశానికి ఆధారం కానున్నాయి. ఈ రోజు నిర్దేశించబడుతున్న చట్టాలు దేశ ఉజ్వల భవిష్యత్తును బలోపేతం చేస్తాయి. పాత చట్టాల నుంచి కొత్త చట్టాలకు అతుకులు లేకుండా ఉండాలి. ఇది అత్యవసరం’ అన్నారు. దీన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వ అధికారులకు శిక్షణ, సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్టు మోడీ తెలిపారు. రాజ్యాంగ నిర్మాతలు స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం వంటి సూత్రాలతో స్వతంత్ర దేశం గురించి కలలు కన్నారని అన్నారు. దృఢమైన న్యాయ వ్యవస్థను ‘విక్షిత్‌ భారత్‌’ (అభివృద్ధి చెందిన భారతదేశం) మూలస్తంభమన్నారు. నమ్మకమైన, చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడానికి తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మోడీ చెప్పారు. 42 కేంద్ర చట్టాలలోని 183 నిబంధనలను నేరరహితం చేయాలని ప్రతిపాదిస్తున్న జన్‌ విశ్వాస్‌ చట్టం పెండింగ్‌ కేసుల సంఖ్యను తగ్గిస్తుందని, న్యాయవ్యవస్థ నుంచి అనవసరమైన ఒత్తిడిని తగ్గించవచ్చని పేర్కొన్నారు.
ఆత్మ పరిశీలన చేసుకోవాలి
న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడుకోవడానికి ప్రస్తుత రాజ్యాంగ భద్రతలు సరిపోవని సీజేఐ డివై చంద్రచూడ్‌ స్పష్టంచేశారు. స్వతంత్ర న్యాయవ్యవస్థ అంటే ఎగ్జిక్యూటివ్‌, లెజిస్లేటివ్‌ శాఖల నుంచి ఇన్సులేట్‌ చేయబడినది. అదే సమయంలో పక్షపాతం లేని న్యాయమూర్తులు కూడా ఉంటారని అన్నారు. ‘స్వతంత్ర న్యాయవ్యవస్థ కోసం రాజ్యాంగం నిర్ణీత పదవీ విరమణ వయస్సు, న్యాయమూర్తుల నియామకం తరువాత వారి జీతం మార్పు నిషేధం వంటి అనేక సంస్థాగత రక్షణలను పొందుపరిచింది. అయితే, స్వతంత్ర న్యాయవ్యవస్థను నిర్ధారించడానికి ఈ రాజ్యాంగ రక్షణలు సరిపోవు’ అని ఆయన పేర్కొన్నారు.
సీజేఐ డివై చంద్రచూడ్‌

Spread the love