వివేక్‌ ఇండ్లు, కార్యాలయాల్లో సోదాలపై ఈడీ ప్రకటన

నవతెలంగాణ హైదరాబాద్‌: చెన్నూరు కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ ఎంపీ గడ్డం వివేక్‌ ఇండ్లు, కార్యాలయాల్లో జరిపిన సోదాలపై బుధవారం ఈడీ ప్రకటన విడుదల చేసింది. ‘‘రూ.8కోట్ల బ్యాంకు లావాదేవీలపై ఫిర్యాదు అందింది. పోలీసుల ఫిర్యాదు మేరకు సోదాలు చేశాం. విశాఖ ఇండస్ట్రీస్‌, ఎంఎస్‌ సెక్యూరిటీ మధ్య రూ.100 కోట్ల లావాదేవీలు జరిగాయి. డబ్బు ఎంఎస్‌ విజిలెన్స్‌ సెక్యూరిటీ రాబడి కాదని తేలింది. వ్యాపారం ద్వారా రూ.20లక్షల ఆదాయమే వచ్చింది. ఆస్తులు, అప్పులు కలిపి రూ.64 కోట్లతో బ్యాలెన్స్‌ షీట్‌ ఉంది. లావాదేవీలు మాత్రం రూ.200 కోట్లకు పైగా గుర్తించాం. కంపెనీలను వివేక్‌ పరోక్షంగా నియంత్రిస్తున్నారు.
ఎంఎస్‌ సెక్యూరిటీ సంస్థ ఫెమా నిబంధనలు ఉల్లంఘించిందని తేలింది. ఎంఎస్‌ సెక్యూరిటీ సంస్థకు యశ్వంత్‌ రియల్టర్స్‌ మాతృ సంస్థ. యశ్వంత్‌ రియల్టర్స్‌లో విదేశీయుల షేర్లు ఎక్కువగా ఉన్నాయి. వివేక్‌ ఫెమా నిబంధనలు ఉల్లంఘించి విదేశంలో సంస్థ ఏర్పాటు చేశారు. సోదాల్లో భారీగా ఎలక్ట్రానిక్‌ పరికరాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నాం. కంపెనీ లేకుండా వాటిపై రూ.కోట్ల ఆస్తులు ఉన్నట్టుగా ఉన్న డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నాం. దర్యాప్తులో భాగంగా విజిలెన్స్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ బోగస్‌గా తెలుస్తోంది’’ అని ఈడీ అధికారులు తెలిపారు.

Spread the love