ప్రతి దరఖాస్తునూ గడువులోగా పరిష్కరించాలి : టీజీఎస్పీడీసీఎల్
సీఎండీ జితేష్ వి.పాటిల్
నవతెలంగాణ-సిటీబ్యూరో
వినియోగదారులకు అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేసేందుకు, పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించడం అధికారుల ప్రధాన బాధ్యత అని టీజీఎస్పీడీసీఎల్ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి.పాటిల్ చెప్పారు. శుక్రవారం టీజీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సీపీటీఐ యూసుఫ్గూడలో యూనిఫాం సర్వీస్ లైన్ చార్జెస్ అమలుపై నిర్వహించిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో సీఎండీ మాట్లాడారు. ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల అసలు లక్ష్యం వినియోగదారులకు నాణ్యమైన, పారదర్శకమైన, సమయానుకూల సేవలందించడమేనన్నారు. ప్రతి దరఖాస్తునూ నిబంధనలకు అను గుణంగా నిర్ణీత గడువులో పరిష్కరించి, వినియోగదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. యూనిఫాం సర్వీస్ లైన్ చార్జెస్ అమలుతో కొత్త విద్యుత్ కనెక్షన్ల మంజూరు ప్రక్రియ మరింత సరళతరం, పారదర్శకంగా మారుతుందని తెలిపారు. వినియోగదారుల సమస్యలను సకాలంలో పరిష్కరించడం, ఫిర్యాదులపై వెంటనే స్పందించడం, ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా సేవలందించడం ప్రతి అధికారి బాధ్యత అని తెలిపారు. ప్రజా సేవే లక్ష్యంగా పనిచేస్తూ టీజీఎస్పీడీసీఎల్ ప్రతిష్టను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. ఈ శిక్షణా కార్యక్రమంలో భాగంగా చీఫ్ ఇంజినీర్ (కమర్షియల్) ప్రతిమ సౌమి ఆధ్వర్యంలో యూనిఫాం సర్వీస్ లైన్ చార్జెస్ అమలు విధానం, తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి నిబంధనలు, వినియోగదారుల సేవల్లో పారదర్శకత, దరఖాస్తుల సకాల పరిష్కారం, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన విధివిధానాలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని 21 ఆపరేషన్ సర్కిళ్ల సూపరింటెండెంట్ ఇంజినీర్లు పాల్గొన్నారు.
అంతరాయం లేని విద్యుత్ సరఫరాకు కృషి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



