నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో
46 డిగ్రీల ఉష్ణోగ్రత
ఉత్తర తెలంగాణ జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక
తెలంగాణకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ
పలు జిల్లాలకు ఈదురుగాలులతో కూడిన వర్ష సూచన!
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణం మండుటెండల మయం గా మారింది. భానుడి భగభగను తట్టుకోలేక ఉత్తరాది జిల్లాల ప్రజలు అల్లాడిపోతున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, జగిత్యాల, కామారెడ్డి, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు మించి నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ హెచ్చరికను విడుదల చేసింది. ఆ జిల్లాల్లో వడగాల్పులు వీచే ప్రమాదముందనీ, ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. మిగతా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో అత్యధికంగా 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలో 45.9 డిగ్రీలు, అసిఫాబాద్ జిల్లాలో 45.2 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. వచ్చే రెండు రోజులు కూడా పలు ప్రాంతాల్లో ఒకటి, రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందనీ, వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, పలు జిల్లాల్లో ఒకటెండ్రు చోట్ల ఈదురుగాలులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆ జాబితాల్లో రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఒకటెండ్రు చోట్ల వర్షాలు పడే అవకాశాలున్నాయి. మంగళవారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు రాష్ట్రంలో 60కిపైగా ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. నల్లగొండ జిల్లా గుర్రంపోడ్ మండలం జునుత్ల గ్రామంలో అత్యధికంగా 4.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నల్లగొండ, నాగర్కర్నూల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి, రంగారెడ్డి, మహబూబాబాద్, జనగాం, మహ బూబ్నగర్ జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి.
మండుటెండలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



