నవతెలంగాణ-ఆలేరు టౌను
మృగశిర కార్తె ప్రవేశంతో మండే ఎండలకు ఉపశమనం కలుగుతుంది. మృగశిర కార్తె సందర్భంగా ఆలేర్ పట్టణంలో సోమవారం పెద్ద ఎత్తున చేపల అమ్మకాలు జరిగాయి. కోరమీను, బొచ్చెలు, రాగులు, అమ్మకలతో చేపల మార్కెట్ కిటకిటలాడింది. పెద్ద ఎత్తున క్వింటాలలో తీసుకువచ్చి పట్టణంలోని మెయిన్ రోడ్డు చాపల మార్కెట్ వద్ద కుప్పలుగా పోసుకున్నారు. మృగశిర కార్తె ప్రారంభం తో పట్టణంలోచేపల భోజన ప్రియుల సందడితో నిండిపోయింది. బస్టాండ్ సమీపంలో చేపల మార్కెట్ వద్దకి, సోమవారం భారీగా జనం తరలివచ్చారు.
మార్కెట్ రోడ్డు వరకు చేపల విక్రయాలు చాలా వేగంగా జరిగాయి. పట్టణ ప్రజలు కార్తె పర్వదినాన్ని పురస్కరించుకుని చేపలను తినడం ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. ఈ కారణంగా మార్కెట్ అంతా పండుగ వాతావరణం కనిపించింది.
పెరిగిన చేపల ధరలు
మృగశిర కార్తె ప్రభావంతో చేపలకు గిరాకీ పెరిగి, ధరలు కూడా ఒక్కసారిగా పెరిగాయి. సాధారణ రోజుల్లో కిలో రవ్వ, బొచ్చె చేపల ధర 120 నుంచి 150 రూపాయలు ఉంటుంది. కానీ, ఇప్పుడు ఆ ధర 200 నుండి 250 రూపాయలకు చేరింది. అదేవిధంగా, ఎంతో రుచిగా ఉండే కొరమీను చేప ధర 450 రూపాయల నుండి 650 రూపాయలకు పెరిగింది. అయినా, చేపల ప్రియులు ధరలతో సంబంధం లేకుండా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు.
కిక్కిరిసిన చేపల మార్కెట్
చేపల అమ్మకాలు రికార్డు స్థాయిలో సాగాయి. ప్రజల రాకతో రోడ్లన్నీ వాహనాల రద్దీతో నిండిపోయి, మార్కెట్ ప్రాంతం కిటకిటలాడింది. మృగశిర కార్తె రోజున చేపలు తింటే వాతావరణంలో వచ్చే మార్పులను తట్టుకునే రోగనిరోధక శక్తి పెరుగుతుందని నమ్మకం. ఈ నమ్మకంతో ప్రతి ఒక్కరూ చేపల కోసం మార్కెట్కు క్యూ కట్టారు. వ్యాపారులు కూడా ఈ సీజన్ అమ్మకాలతో భారీగా లాభాలను అందుకున్నారు. మటన్ 900 నుండి వెయ్యి రూపాయల కిలో చొప్పున వ్యాపారులు అమ్మారు. చికెన్ మార్కెట్ మాత్రం మేధావిధిగా సాగింది.



