ట్రాక్టర్‌ బోల్తాపడి ఐదుగురు మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : అతివేగం ఐదు ప్రాణాలు తీసింది. వేగంగా వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడటంతో డ్రైవర్‌ సహా ఐదుగురు బాలురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మరణించిన డ్రైవర్‌తోపాటు అందరూ మైనర్‌లే కావడం గమనార్హం. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం జబల్‌పూర్‌ జిల్లాలోని చర్గవాన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోగల తినేతా గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  ధర్మేంద్ర ఠాకూర్‌ అనే 18 ఏళ్ల బాలుడు.. లక్కీ మార్కమ్‌ (10), అనూప్‌ బర్కడే (12), రాజ్‌వీర్‌ గోండ్‌ (13), దేవేంద్ర బర్కడే (15), దళ్పత్‌ గోండ్‌ (12), వికాస్‌ ఉయ్‌కే (10) లను ట్రాక్టర్లో తీసుకుని చేను దగ్గరికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ట్రాక్టర్‌ను వేగంగా నడపడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో దల్పత్‌ గోండ్‌, వికాస్‌ ఉయ్‌కే మినమా మిగతా ఐదుగురు మరణించారు. మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఐదు మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Spread the love