బోల్తా పడ్డ బస్సు.. నలుగురు మృతి..

నవతెలంగాణ – హిమాచల్ ప్రదేశ్: శుక్రవారం ఉదయం హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హిమాచల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (హెచ్‌ఆర్‌టీసీ) బస్సు బోల్తా పడడంతో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో బస్సు డ్రైవర్, కండక్టర్, ఒక మహిళ, నేపాలీ జాతీయుడు ఉన్నట్లు సమాచారం. తెల్లవారుజామున జుబ్బల్ కుడు నుండి గిల్తారీకి వెళ్తున్న హెచ్‌ఆర్‌టీసీ బస్సు గిల్తారి సమీపంలోకి రాగానే అకస్మాత్తుగా బోల్తా పడింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్‌, కండక్టర్‌తో సహా మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత చుట్టుపక్కల వారు బస్సు వద్దకు చేరుకుని లోపల చిక్కుకున్న వారిని బయటకు తీశారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన మృతదేహాలను పోస్టుమార్టుకు పంపించామని  తెలిపారు.

Spread the love