మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురి మృతి..

నవతెలంగాణ – వనపట్ల: నాగర్‌కర్నూలు జిల్లాలోని వనపట్లలో విషాదం చోటు చేసుకుంది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ మండలంలోని వనపట్ల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం .. గొడుగు భాస్కర్, పద్మ (28)భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కూతుర్లు పప్పి (6) వసంత (7) కుమారుడు విక్కీ (ఏడాది మూడు నెలలు) ఉన్నారు. భాస్కర్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే తిని ఇంట్లో పడుకున్నారు. ఆదివారం కురిసిన వర్షానికి అర్థరాత్రి ఇంటి పైకప్పు కూలి తల్లి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు అక్కడికి అక్కడే మృతి చెందారు. తండ్రి భాస్కర్ పరిస్థితి విషమంగా ఉండడంతో నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఒకే కుటుబంలో నలుగురు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఘటన స్థలానికి నాగర్ కర్నూల్ పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

Spread the love