![గవర్నర్ తమిళిసై సౌందరరాజన్](https://navatelangana.com/wp-content/uploads/2023/08/governor.jpg)
నవతెలంగాణ హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఆ పరిస్థితులు తనెంతో బాధించాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను చూస్తుంటే హృదయం కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం మరింత రక్షణ కల్పించాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు కూడా ప్రజలకు అండగా ఉండాలన్నారు. వర్షాల కారణంగా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. వర్షాలపై కొన్ని రాజకీయ పార్టీలు తనకు మెమొరాండం ఇచ్చాయని తమిళిసై తెలిపారు. నీట మునిగిన గ్రామాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. వర్షాలు, వరదలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక అడిగానని.. రాగానే కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నట్టు ఆమె వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో త్వరలోనే పర్యటిస్తామని గవర్నర్ తెలిపారు. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని.. బిల్లులు తిప్పి పంపడానికి గల కారణాలను వెల్లడించినట్టు చెప్పారు. బిల్లులు తిప్పి పంపడం తన ఉద్దేశం కాదని గవర్నర్ స్పష్టం చేశారు.