హత్రాస్‌: మనువాద అన్యాయానికి ప్రతీక

Hatras: A symbol of human injustice”మేమే, నేరస్తులం. మా చెల్లిపై సామూహిక అత్యా చారానికి పాల్పడి, హత్య చేసినవారు స్వేచ్ఛగా ఉన్నారు. ఊళ్లో వారు విజేతల్లాగా తిరుగుతున్నారు. కానీ మేము మా ఇంటి బయటికి అడుగు వెయ్యలేకపోతున్నాం” అని హత్రాస్‌ బాధితురాలి 33 ఏళ్ల సోదరుడైన సతీందర్‌ కు మార్‌, జనవరి 17న వారి గ్రామం బుల్‌గర్హీకి వెళ్లిన నాతో, సుభాషిణి ఆలీతో అన్నాడు. వారి సంక్షేమం గురించి తెలుసుకుందామని అక్కడికి వెళ్ళాం. సిగ్గుమాలినతనంతో న్యాయం అణచివేతను, కులనియమావళి అమలును అక్కడ గమనిం చాం. నేటి ఉత్తరప్రదేశ్‌లో ఒక దళితుడికి న్యా యం జరగాలని పోరాడటం చాలా కష్టమనే నిజం మాకు అర్థమైంది. కుటుంబ కష్టాల్ని తెలుసుకునే క్రమంలో, మనువాద కుల నియమావళి అమల్లో నాలుగు దశలున్నా యని తెలిసింది.
మొదటిదశ – నేరం : మొదటిది, సెప్టెంబర్‌ 2020లో జరిగిన నేరం-ఒక పేద దళిత కుటుంబానికి చెందిన 19 ఏళ్ల అమ్మాయిపై అగ్రవర్ణానికి చెందిన నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి, హత్య చేశారు. కుల, వర్గ, పితస్వామిక దోపిడీలు, అణచివేత కలిసిన అసాధారణ ”మేడ్‌ ఇన్‌ ఇండియా” కేంద్రంగా ఆమె ఉనికి ఉంది. బా ల్మీకి, దళిత, పేద, మహిళ. పందొమిదేళ్ల వయసు. ఇదొక కుల నేరం. మహిళకు వ్యతిరేకంగా జరిగిన నేరం.పేద మ హిళకు వ్యతిరేకంగా బలమైన గ్రామీణ ఉన్నత శ్రేణులు జరిపిన వర్గ నేరం. ఇది, ఒక యోగ్యత ఆధారంగా జరిగిన నేరం అందుకే దీనిని నేరంగా పరిగణించరు.
రెండవ దశ – ప్రభుత్వ పక్షపాతం : రెండో దశలో పాల నా విభాగం, యూపీ ప్రభుత్వం ద్వారా నేరాన్ని కులంతో కప్పివేశారు.సెప్టెంబర్‌ 2020లో నేరం జరిగింది. పాలనా విభాగం, ప్రభుత్వం, విచారణను బలహీనపర్చడానికి సా ధ్యమైనంత కషిచేశాయి. మొదటి నుండి కూడా అత్యా చారం అసలు జరుగలేదనీ, ఏది జరిగినా అంగీకారంతోనే జరిగిందనే అబద్ధాన్ని బయట పెట్టారు. ఐదు రోజులపాటు అసలు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు. వైద్య పరీక్షల్ని ఆల స్యంగా చేసి, ముఖ్యమైన రుజువును లేకుండా చేశారు. అత్యవసరంగా అందించాల్సిన వైద్యాన్ని అందించక పోవ డంతో ఆ అమ్మాయి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆల స్యంగా ఆమెను ఓ ఢిల్లీ ఆసుపత్రికి తరలించారు. ఆమె మరణం తరువాత పోలీసులే మతదేహాన్ని బలవంతంగా తీసుకెళ్ళి, కుటుంబసభ్యుల అనుమతి లేకుండానే రాత్రికి రాత్రే అంత్యక్రియలు నిర్వహించారు. అంత్య క్రియలు నిర్వ హించడం ద్వారా రెండో పోస్ట్‌మార్టం చెయ్యాలనే డిమాం డ్‌ లేకుండా పోలీసులు అడ్డుకున్నారు. దేశవ్యాప్తంగా నిర సనలు, ఆగ్రహజ్వాలలతో కేసును సీబీఐకి అప్పగించారు.
మూడవ దశ – న్యాయ పోరాటం : న్యాయ ప్రక్రియలో, ప్రభుత్వ పక్షపాత ధోరణి కొనసాగింపులో మనువాద కుల నియమావళి మూడవదశగా ఉంటూ వచ్చింది. ఆ యువ తిపై జరిగిన అఘాయిత్యాల వివరాలన్నీ సీబీఐ చార్జిషీట్‌ లో ఉన్నాయి. గ్యాంగ్‌ రేప్‌, హత్య, కుట్ర సంబంధిత నిబం ధనల కింద అభియోగాలు మోపారు. బాధితురాలి మరణ వాంగ్మూలంపైన చార్జిషీట్‌ ఆధారపడింది, ఈ విషయాన్ని తీవ్రంగా బాధపడుతున్న అమ్మాయిని మొదట గమనించిన తల్లి కూడా తెలిపింది. అట్రాసిటీల నిరోధక చట్టం కింద ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగా జరిగిన కేసుల్ని విచారించేం దుకు నియమించబడిన ప్రత్యేకకోర్టు ఈ కేసును విచా రించింది. ఎలాంటి కారణా ల్లేకుండా కోర్టు, బాధితురాలి మరణ వాంగ్మూలాన్ని కొట్టివేసి, తల్లి చెప్పిన విషయాల్ని పక్కన పెట్టింది. ఆ అమ్మాయి పేర్కొన్న నలుగురి లో ముగ్గుర్ని నిర్దోషులుగా విడుదల చేసి, సెక్షన్‌ 304 కింద తక్కువ నేరం చేశాడని నాలుగో వ్యక్తికి శిక్ష వేశారు. ఇది నేరపూరిత నరహత్య.
యూపీలో ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ కులానికి చెందిన సోదర సభ్యులు, శిక్ష మినహాయింపు ప్రత్యే కతల్ని అనుభవిస్తున్నారు. కుల సమీకరణలు తారు మారై, ఒకవేళ బాధితురాలు అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి అయి, నేరం చేసిన వారు దళితులు లేదా ఇత ర మైనార్టీలై ఉంటే, ఒకవేళ ఆ అమ్మాయి హత్రాస్‌ బాధితురాలి వలెనే ఒక మరణ వాంగ్మూలం ఇచ్చి ఉండి ఉంటే, ఎలాంటి వాదనల్లేకుండా అది అంగీకరించ బడి ఉండేది, నేరస్తులకు జీవిత ఖైదు విధించి ఉండేవారు. మరణ వాంగ్మూలానికి కోర్టు ఎప్పటికీ ప్రాధాన్యత ఇస్తుంది. కానీ హత్రాస్‌లో బాధితురాలు బాల్మీకి కులానికి చెందింది. రాజీ చేసి, తీర్పును అంగీకరించడానికి ఆ కుటుంబంపై ఒత్తిడి తెచ్చారు. ఇలాంటి అన్యా యమైన తీర్పుపై ప్రభుత్వం అప్పీలు చేస్తుంది అనుకున్న వారి ఆశలు అడియాశలు అయ్యాయి. యూపీ ప్రభుత్వం అప్పీల్‌ చేయడానికి నిరాకరిం చింది. ఇలాంటి పూర్వ నమూనాలు ఏమైనా ఉన్నా యా? గ్యాంగ్‌ రేప్‌, కుట్ర, హత్య లాంటి సీబీఐ నమోదు చేసిన భయంకరమైన అభియోగా లుండి, కింది కోర్టు తిరస్కరించిన చార్జిషీట్‌ను తమ సొంత కేసును సమర్థించుకోడానికి అప్పీల్‌ చేయడానికి సీబీఐ నిరాకరిస్తుందా? సీబీఐ, కేంద్ర హోంశాఖ ఆధీనంలో పనిచేస్తుంది. అప్పీలు చేయ కూడదనే నిర్ణయం వెనుక హోంశాఖ, దాని బలమైన మంత్రి అమిత్‌ షా అంగీకారం ఉంటుంది. అప్పీల్‌ చేయ డానికి ప్రభుత్వం, సీబీఐ నిరాకరించడంతో, దాన్ని సవాల్‌ చేస్తూ బాధిత కుటుంబం అలహాబాద్‌ హైకోర్టులో అప్పీలు చేసింది. ఆ కేసు ఇప్పుడు పెండింగ్‌లో ఉంది.
రెండో కేసు లక్నో బెంచ్‌కి సంబంధించింది.సెప్టెంబర్‌ 2020లో ఘోరమైన నేరం జరిగిన తర్వాత లక్నో బెంచ్‌ ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. అక్టోబర్‌ 2020లో బాధిత కుటుంబాన్ని కోర్టుకు పిలిపించింది. ప్రభుత్వం కు టుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి, ఆ కుటుం బానికి భద్రత కల్పించి, సురక్షిత ప్రాంతానికి తరలించా లని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిందితుల్ని నిర్దోషు లుగా విడుదల చేస్తూ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ అప్పీలు చేయడానికి నిరాకరించి, లక్నో కోర్టు ఇచ్చిన ఆదే శాల ప్రకారం ఒకరికి ఉద్యోగం ఇవ్వడానికి, కుటుంబానికి ప్రత్యామ్నాయంగా గహ వసతి ఏర్పాటుకు వ్యతిరేకంగా యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేస్తుంది. బాధిత కుటుంబం ఆ కేసును సుప్రీంకోర్టులో ఎదుర్కొనేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చింది. ఏప్రిల్‌ 2023లో ప్రధాన న్యాయమూర్తి నేతత్వంలోని ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం, లక్నో కోర్టు తీర్పుపై స్టే కోరుతూ దాఖ లైన ప్రభుత్వ అప్పీల్‌ను తిరస్కరించింది. అయితే ప్రభు త్వం ఆ తీర్పును అమలు చేయకుండా నిరాకరించింది. సుప్రీంకోర్టులో తదుపరి విచారణ జనవరి 2024 తరు వాత జరుగుతుంది. ఈ రెండు కేసుల్లో కూడా భారం, ఆందోళన, న్యాయ ప్రక్రియకు అయ్యే ఖర్చును ఆ కుటుం బమే భరిస్తుంది. రెండు కేసుల్లోనూ వారు ప్రభుత్వంతోనే పోరాడాల్సి వస్తుంది.
నాల్గవ దశ – బతుకు పోరాటం : కొనసాగుతున్న నాల్గవ దశలో, గ్రామ స్థాయి నుంచి ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వరకూ ఉన్న అధికార శక్తులతో రోజువారీ బతుకు పోరాటం జరుగుతోంది. గతేడాది నిందితులు విడుదల అయినప్పుడు జరిగిన దశ్యాల గురించి సోదరులు సతీం దర్‌, సందీప్‌లు మాతో చెప్పారు. బిల్కిస్‌ బానో కేసులో రేపిస్టులు, హంతకులు విడుదలైనప్పుడు వీహెచ్‌పీ ఉత్స వాల నిర్వహణను ఇది, మనకు గుర్తుకుతెస్తుంది. మార్చి 3, 2023న తీర్పు వెలువడిన వెంటనే వారిని విడుదల చేశారు. హౌళీ పండుగకు కొద్ది రోజుల ముందు ఇది జరి గింది. కానీ హోలీ పండుగను జరుపుకున్న విధంగా ఉత్స వంగానే ఇది జరిగింది. వారిని మేళతాళాలతో, పూలవర్షం కురిపిస్తూ, వారి సంఘ సభ్యులు పూలదండలు వేసి ప్రద ర్శనగా స్వాగతం పలికారని వారన్నారు. బుల్‌గర్హి గ్రామం లో కేవలం ఆరు దళిత కుటుంబాలే ఉన్నాయి. ఆ గ్రామం లో మెజారిటీ కుటుంబాలు ఠాకూర్లు. నిందితులంతా ఈ కులానికి చెందినవారే. బ్రాహ్మణ కుటుంబాల సంఖ్య చాలా ఎక్కువ. తమను భయపెట్టి, ఒంటరిని చేస్తున్నారని బాధి తులు తెలిపారు.
మొదట్లో ఆ కుటుంబానికి నష్టపరిహారంగా ప్రభు త్వం 25 లక్షల రూపాయలిచ్చింది. కుటుంబానికి 24 గం టలు భద్రత ఏర్పాటు చేయాలన్న కోర్టు ఆజ్ఞల్ని అమలు చేసింది. మేము ఆ కుటుంబం వద్దకు వెళ్ళేసరికి, వారుం టున్న ఇంటి ఆవరణలోని ఒక భాగంలో కేంద్ర బలగాల క్యాంపు కనిపించింది. కుటుంబ రక్షణ కోసం ఒక కంపెనీని కేటాయించారనీ, వారి భద్రత కోసం 15 మంది సిబ్బందిని కేటాయించారని చెప్పారు. వారక్కడ లేకుంటే, కుటుం బాన్ని చంపి ఉండెడివారని ఒక కానిస్టేబుల్‌ మాతో అన్నా డు. ఈ కుటుంబం కోర్టులో పోరాటం చేస్తుందని, వీరిపై గ్రామంలో చాలా కోపం ఉందని వారన్నారు.
అయితే భద్రత కూడా రెండువైపులా పదునైన కత్తి అని రుజువైంది. ఇద్దరు సోదరులూ వారి ఉద్యోగాలు కో ల్పోయారు. సతీందర్‌ నోయిడాలోని ఒక మాన్యుఫాక్చ రింగ్‌ ఫ్యాక్టరీలో, అతని తమ్ముడు సందీప్‌ ఘజియాబాద్‌ లోని ఒక మొబైల్‌ కంపెనీలో పనిచేసేవారు. వారి తల్లి దండ్రుల సంరక్షణ కోసం గ్రామంలోని ఇంటికి రావాల్సి వచ్చేది. భద్రతా సిబ్బంది లేకుండా ఇప్పుడు వారు ఇల్లు విడిచి బయటికి వెళ్లలేరు. వారి వెంట సాయుధ పోలీసు లుంటారు. కాబట్టి వారికెవరూ ఉద్యోగాలివ్వడానికి ఇష్ట పడటం లేదు. కొన్ని దశాబ్దాల క్రితం దళితుల భూపంపిణీ కార్యక్రమంలో వారికి ఐదు భిగాల భూమినిచ్చారు. రెండు భిగాల భూమిని అగ్ర వర్ణాలవారు చట్టవ్యతిరేకంగా ఆక్ర మించుకున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లే సమయంలో కూడా పోలీసులు వెంట ఉంటున్నారనీ, ఆఖరికి కూరగా యలు కొనేందుకు కూడా వారు ఇంటి నుండి బయటకి అడుగుపెట్టలేకపోతున్నామనీ, మార్కెట్‌కు వెళ్ళేటప్పుడు ముందు ఇద్దరు, వెనుక ఇద్దరు పోలీసులు ఉండడం వల్ల అందరి దష్టి మాపైనే పడిన ఫలితంగా మమ్ముల్ని ”హ త్రాస్‌ కేసు” కుటుంబంగా గుర్తిస్తున్నారు. ఆ కుటుంబంలో శాంతీదేవి అనే 80 ఏళ్ల నాయనమ్మ, బాధితురాలి తల్లిదం డ్రులు ఓం ప్రకాష్‌, రమాదేవిలు ఉంటారు. ఓం ప్రకాష్‌ దశాబ్దాలుగా అసన్సోల్‌లో కార్మికునిగా పనిచేస్తూ ఉన్నాడు, అతనికి ఎర్రజెండాతో అనుబంధం ఉంది. జ్యోతీబసు నా యకత్వంలోని బెంగాల్‌లో ఇలాంటి అన్యాయం ఎప్పుడూ జరగలేదని ఆయన అన్నాడు. ఇంకా సతీందర్‌ భార్య సంధ్య, వారి ముగ్గురు పిల్లలు, 23 ఏళ్ల వారి తమ్ముడు సందీప్‌ ఉన్నారు. భద్రతా కారణాల దష్ట్యా వారి పిల్లలు స్కూల్‌కు వెళ్ళడం లేదు. పెద్ద పాపను సంధ్య తల్లిదండ్రు ల వద్దకు పంపించారు. మిగిలిన ఇద్దరు పిల్లలకు చదు వుకునే హక్కును ఈ పరిస్థితులు ఆటంక పరిచాయి. కు టుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఈ మూడేళ్ల కా లంలో నష్టపరిహారంగా ఇచ్చిన డబ్బును కేసు కోసం ఖర్చు చేస్తున్నారు. వీరిపట్ల సానుభూతితో ఉన్న న్యాయవాదులు ఫీజు తీసుకోకపోయినప్పటికీ కోర్టుకు వెళ్లిన ప్రతిసారీ వేల రూపాయలు ఖర్చవుతాయి. వారు కుటుంబ సభ్యుల కోస మే కాక భద్రతా సిబ్బందికి కూడా వాహనాన్ని అద్దెకు తీసు కోవాలి. కొన్ని సందర్భాల్లో, ముఖ్యంగా తొలి రోజుల్లో వారు వివిధ కోర్టులకు వెళ్ళాల్సి వచ్చేది. లక్నో, అలహాబా ద్‌లకు నెలలో చాలాసార్లు వెళ్ళాల్సి వచ్చింది. ప్రతి సందర్భంలో కుటుంబం సామాజిక కార్యక్రమాలకు వెళ్ళాలి, అప్పుడు కూడా ఇలాంటి ఖర్చులే. ప్రయా ణపు ఏర్పాట్లన్నింటినీ కుటుంబమే చూసుకోవాలి. ఫలితంగా అసలు కుటుంబం బయటకు వెళ్లడమే మానేసింది. గతేడాది సంధ్య తీవ్ర అనారోగ్యం పా లైంది. ఆమెను ఆగ్రాలోని ఆసుపత్రిలో చేర్చాల్సి వ చ్చింది. ఆమె వైద్య ఖర్చులే కాక, భద్రతా సిబ్బందికి ఖర్చుతో కూడిన ప్రత్యేక గదిని కూడా కుటుంబం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. మాతో మాట్లాడుతు న్నప్పుడు రమాదేవి చాలాసార్లు విరుచుకొని పడి పోయింది. తనకు తన కూతురి శరీర క్రూరమైన చిత్రాలు కనిపిస్తున్నాయనీ, ఈ హింసకు పాల్పడిన వారిని విడుదల చేస్తూ, మాకు చేసిన అన్యాయాన్ని అంగీకరిం చడం కష్టంగా ఉందని చెప్పింది. ఇది కేవలం తన కూతు ర్ని మాత్రమే కాక, మొత్తం కుటుంబాన్ని కూడా నాశనం చేసిందని విలపిస్తూ చెప్పింది. తన కొడుకుల వైపు చూపి స్తూ, వారేమి నేరం చేశారని, సాధారణ జీవితాలకు దూర మయ్యారు, వారికి ఏ ఉద్యోగం లేకుండా మేమెలా బత కాలని ఆమె అంటుంది. నష్టపరిహారంగా ఇచ్చిన డబ్బు దాదాపు అయిపోయిందని సతీందర్‌ అన్నాడు. కొంత డ బ్బును కేసు ఖర్చుల కోసం పక్కకు పెట్టి, ఇతర ఖర్చుల్ని తగ్గించుకోడానికి ప్రయత్నం చేస్తున్నామని అన్నాడు. మా తిండికి, కనీస ఖర్చులకు నెలకు కనీసం 15వేల రూపా యలు అవసరమని, అయితే ఆదాయం లేకుండా పరిస్థితి దారుణంగా ఉంటుందని అతడు అన్నాడు. తాను ధరిం చిన దుస్తులను చూపిస్తూ, ఇవి తమ బంధువులు ఇచ్చా రని, మా కష్టాల గురించి మాట్లాడటం మాకు సిగ్గని పిస్తుందని అన్నాడు.
ఇక్కడి లోక్‌సభ స్థానం ఎస్సీలకు రిజర్వ్‌ చేయబడిం ది. ప్రస్తుత ఎంపీ, బీజేపీకి చెందిన రజ్వీర్‌ దిలర్‌. ఆయన ఒక్కసారి కూడా బాధిత కుటుంబాన్ని సందర్శించలేదు. వారి బాధల గురించి అడిగితే, ప్రభుత్వం రూ.25 లక్షలు ఇచ్చింది, ఇంకా ప్రభుత్వం ఏమి ఇస్తుందని అన్నాడు. తమ ఇళ్ళల్లో టీ తాగడానికి ఉపయోగించే గ్లాసుల్లో దళితులకు టీ ఇవ్వని అగ్రవర్ణాల వారి ఇండ్లకు ఆ ఎంపీ వెళితే, తన తోపాటు స్వంత టీ గ్లాసు తీసుకొని, ఆ గ్లాసులోనే టీ తాగుతాడనే కథనాన్ని మాకు చెప్పారు. ఆ విధంగా తన నియోజకవర్గంలోని అగ్రవర్ణాల వారిని అవమానానికి గురికాకుండా చూస్తాడు. ఇవి, ఒక బీజేపీకి చెందిన ఎస్సీ ఎంపీ అవమానకరంగా అంటిపెట్టుకుంటున్న కుల నియ మావళి. ఇవే నియమాల్ని దళితులు అంతా అనుసరిం చాలని కోరుకుంటున్నారు.
ఈ దారుణమైన పరిస్థితి ఒక దళిత కుటుంబానికి పడిన శిక్ష. వారి చెల్లెలిపై అత్యాచారం చేసి, హత్య చేసిన వారితో రాజీకి నిరాకరించిన కారణంగానే వారికి ఈ శిక్ష పడింది. దళితులు, మహిళలకు వ్యతిరేకంగా బీజేపీ డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వ క్రూరత్వానికి, మనువాద అన్యాయానికి హత్రాస్‌ ఒక ప్రతీక.
(”పీపుల్స్‌ డెమోక్రసీ” సౌజన్యంతో)
అనువాదం : బోడపట్ల రవీందర్‌, 9848412451
– బృందా కారత్‌

Spread the love