Saturday, September 5, 2026
E-PAPER
Homeజాతీయంఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం..రెడ్ అలర్ట్ జారీ!

ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం..రెడ్ అలర్ట్ జారీ!

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : దేశ రాజధాని ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాలను (ఎన్‌సీఆర్) శనివారం ఉదయం కూడా కుండపోత వర్షం ముంచెత్తింది. భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమవడంతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఢిల్లీకి ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. వర్షాల వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో పాటు, విమాన సర్వీసులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

భారీ వర్షాల నేపథ్యంలో ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి విమానయాన సంస్థలు ప్రయాణికులకు పలు సూచనలు జారీ చేశాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల విమాన సర్వీసులు ఆలస్యమయ్యే అవకాశం ఉందని, ప్రయాణికులు తమ విమాన ప్రయాణ స్థితిగతులను ముందుగానే తనిఖీ చేసుకోవాలని సూచించాయి.

రోడ్లపై నీరు నిలిచిపోవడంతో విమానాశ్రయానికి చేరుకోవడానికి అదనపు సమయం పట్టవచ్చని హెచ్చరించాయి. అయితే, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలు ప్రస్తుతానికి సాధారణంగానే కొనసాగుతున్నాయని విమానాశ్రయ నిర్వహణ సంస్థ జీఎంఆర్ స్పష్టం చేసింది.

నగర పరిధిలోని కన్నాట్ ప్లేస్ ఔటర్ సర్కిల్, గీతా కాలనీ, అక్బర్ రోడ్ వంటి ప్రధాన ప్రాంతాలు జలమయమయ్యాయి. కన్నాట్ ప్లేస్‌లో మోటార్ల సాయంతో నీటిని తోడివేస్తున్నప్పటికీ, కొన్ని దుకాణాల్లోకి వర్షపు నీరు చేరింది. గ్రేటర్ నోయిడా, నోయిడా ప్రాంతాల్లోనూ భారీ వర్షపాతం నమోదైంది.

ఈ వర్షాల ప్రభావంతో ఢిల్లీ వాసులకు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది. నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 24.8 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. అయితే, ఆదివారం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని, సెప్టెంబర్ 7 నుంచి కేవలం తేలికపాటి జల్లులు మాత్రమే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -