హైకోర్టు సంచలన తీర్పు..దేవుణ్ని ప్రార్థిస్తున్నాడని మరణశిక్ష ర‌ద్దు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఒడిశా హైకోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. ఆరేళ్ల బాలికపై లైంగిక‌దాడి కేసులో దోషిగా తేలిన ఎస్‌కే ఆసిఫ్‌ అలీకి ఒడిశాలోని జగత్‌సింగ్‌పుర్‌లో ఉన్న పోక్సో కోర్టు విధించిన మరణశిక్షను హైకోర్టు జీవిత ఖైదుగా మార్చింది. దీనికి సంబంధించి జూన్‌ 27న 106 పేజీల తీర్పును హైకోర్టు ఇచ్చింది. తీర్పు ఇచ్చే క్రమంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఈ కేసులో దోషిగా తేలిన ఆసిఫ్‌ అలీ రోజూ దేవుణ్ని ప్రార్థిస్తున్నాడు. అతడు దేవుడి ముందు లొంగిపోయాడు. తాను చేసిన నేరాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే అతడికి విధించిన మరణశిక్షను జీవితఖైదుగా మారుస్తున్నాం’’ అని తీర్పు ఇచ్చే సందర్బంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. బాధిత బాలిక కుటుంబానికి రూ.1.50 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని పోక్సో కోర్టు ఆదేశించగా.. దాన్ని సవరించిన న్యాయస్థానం రూ.10 లక్షలు అందించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

Spread the love