సీఎం పర్యటన సందర్భంగా సీపీఐ(ఎం) నేతల ముందస్తు అరెస్టులు
ఖండించిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ
నవతెలంగాణ-నల్లగొండ టౌన్
సీఎం పర్యటన పేరుతో ప్రతిపక్ష నాయకులను నిర్బంధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సీపీఐ(ఎం), ప్రజాసంఘాల నాయలకు ముందస్తు అరెస్టులను ఆయన ఖండించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని ఎన్నికల సందర్భంగా చెప్పిన రేవంత్రెడ్డి.. అధికారంలోకి రాగానే గత పాలకుల మాదిరిగానే ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరేసేలా రాజకీయ నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిస్తామని హెచ్చరించారు. నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున నల్లగొండ టూ టౌన్ పోలీసులు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, బండ శ్రీశైలం, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేశ్ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. సీఐటీయూ నాయకులు దండంపల్లి సత్తయ్య, అవుట రవీందర్ను అరెస్టు చేసి వన్ టౌన్ పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి పోలీసుల అక్రమ అరెస్టులను ఖండించారు. అక్రమంగా అదుపులోకి తీసుకున్న సీపీఐ(ఎం), సీఐటీయూ నాయకులను వెంటనే విడుదల చేయాలని, ఇలాంటి నిర్బంధ చర్యలను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
నాయకుల నిర్బంధం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



