అడుగట్టిపోతున్న బోర్లు, ఎండిపోతున్న పంటలు
నవతెలంగాణ – మిరుదొడ్డి
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో రైతన్నలు సాగునీటి కష్టాలతో సతమతమవుతున్నారు. తీవ్ర ఎండలకు భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్లు నీరందక వెలవెలబోతున్నాయి. దీంతో ఖరీఫ్ సీజన్కు సిద్ధమవుతున్న రైతుల్లో ఆందోళన మొదలైంది. మిరుదొడ్డి మండల వ్యాప్తంగా గత నెల రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. దీని ప్రభావం నేరుగా వ్యవసాయంపై పడింది. మండలంలోని పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు పూర్తిగా ఎండిపోయి అడుగంటాయి. పంట పొలాలకు నీళ్లు పెట్టేందుకు రైతులు వేసిన బోర్లు సైతం నీళ్లు లేక విఫలమవుతున్నాయి.
వందల ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు సాగునీరు అందక వాడిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. ఒక్క పంట చేతికి అందుతుందో లేదో అనే భయం వెంటాడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు పశువులకు సైతం తాగునీరు కరువైంది. ఈ నేపథ్యంలో మిరుదొడ్డి మండల రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగర్ కాలువల ద్వారా తమ మండలంలోని చెరువులను నింపాలని డిమాండ్ చేస్తున్నారు. యుద్ధప్రాతిపదికన కాలువ పనులు పూర్తి చేసి నీళ్లు విడుదల చేస్తేనే తమకు ఉపశమనం లభిస్తుందని రైతులు కోరుతున్నారు.



