అవకాశవాదులకు, మతోన్మాదులకు వ్యతిరేకంగా పోరాడేది ఎర్రజెండానే..

– కమ్యూనిస్టుల గెలిపే ప్రజల గెలుపు..
– అవకాశవాద రాజకీయాలను తరిమికొట్టాలి..
– ధన బలం, ప్రజాబలం మధ్య బోనగిరిలో పోటీ ..
– మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే , సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి..
– సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి..
నవతెలంగాణ – మునుగోడు
అవకాశవాదులకు అవకాశం, మతోన్మాదులకు వ్యతిరేకంగా పోరాడేది ఎర్రజెండానే అని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే , సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని  సత్య ఫంక్షన్ హాలో  నిర్వహించిన మునుగోడు మండల సీపీఐ(ఎం) జనరల్ బాడీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాడే సీపీఐ(ఎం) బోనగిరి పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్ ను పార్లమెంటుకు పంపేందుకు ప్రజలను కోరారు. భువనగిరి గడ్డపైన సీపీఐ(ఎం) గెలిస్తే ప్రజల పక్షాన పార్లమెంటులో ప్రజా గొంతుకై కమ్యూనిస్టులు వినిపిస్తారని తెలిపారు. పది సంవత్సరాలుగా దేశాన్ని  పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని అన్నారు. ఈ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ ప్రైవేట్ పరం చేస్తూ దేశంలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగమును పెంచి పోషించిందని అన్నారు. వీర తెలంగాణ  రైతాంగ సాయుధ పోరాటంలో  కమ్యూనిస్టులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటాలు చేసిన చరిత్ర ఎర్రజెండాదని అన్నారు.
                          భువనగిరి పార్లమెంటు పరిధిలో జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలలో ఒకపక్క ధన బలంతో వస్తున్న అభ్యర్థులకు, మరోపక్క ప్రజల బలంతో వస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థికి జరుగుతున్న యుద్ధంలో ఎగిరేది ఎర్రజెండా అనే అని ధీమా వ్యక్తం చేశారు. పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే,  పేద ప్రజలకు అండగా ఉండి పేద ప్రజల న్యాయం కోసం పోరాడే ఎర్రజెండా పక్షాన  నిలిచి, ప్రజలు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్మికులు, కర్షకులు కొట్లాడి సాధించుకున్న కార్మికుల హక్కులను కాలరాస్తూ పెట్టుబడుదారులకు కొమ్ముగాసే విధంగా బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను ఎత్తివేసేందుకు కుట్ర పన్నడం సిగ్గుచేటని అన్నారు. రాజ్యాంగం రక్షించాలన్నా, ప్రజాస్వామ్యంను పరిరక్షించాలన్న కేంద్రంలో బీజేపీని సాగనంపాలని అన్నారు. దేశాన్ని హిందూ దేశంగా మార్చి మనువాద రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నారని అన్నారు. రాముడి పేరుతో బీజేపీ  రాజకీయాలు చేస్తూ, కులమతాల మధ్య చిచ్చులు పెట్టి, మత విద్వేషాలను రెచ్చగొడుతూ హిందుత్వ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. బూర్జువా పార్టీలకు వ్యతిరేకంగా  వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులను కూడగట్టి ముందుకు సాగాలని సూచించారు. బీజేపీ గత ఎన్నికల ముందు రైతులను రెట్టింపు ధనవంతులను చేస్తామని, ఎన్నికల హామీలు ఇచ్చి,  హామీలను అమలు చేయకుండా విస్మరించారని అన్నారు. నల్ల డబ్బును బయటికి తీసి దేశ ప్రజల ఖాతాల్లో ప్రతి ఒక్కరికి రూ.15లక్షలు జమ చేస్తామని చెప్పి,  ప్రజల్ని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ఎక్కడికి పోయిందోనన్నారు.  మరోవైపు బీజేపీ అధికారంలోకి వచ్చాక అవినీతికి చట్టబద్ధత కలిగించిందన్నారు. ఎలెక్ట్రోల్ బాండ్స్ రూపంల్ రూ.1600 కోట్ల రూపాయల అవినీతి జరిగితే రూ.800 కోట్ల రూపాయలు బీజేపీ పార్టీకి చేరాయన్నారు. ఈ ఎలెక్ట్రోల్ బాండ్స్ చట్ట విరుద్ధమైనవని సీపీఐ(ఎం) పోరాడిందన్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం వల్ల అవినీతి బయటికి వచ్చిందన్నారు. విద్యా రంగానికి కేవలం 4% మాత్రమే నిధులు కేటాయించారని, విద్యను పూర్తిగా ప్రయివేటికరణ చేశారన్నారు. ఆకలిశుచిలో మనదేశం 111 స్థానంలో ఉందన్నారు. లిక్కర్ కేసులో బీజేపీకి ఆరవిండో పార్మా కంపెనీ అధినేత శరత్ చంద్రారెడ్డి ద్వారా రూ.60 కోట్ల రూపాయల ముడుపులు ముట్టాయన్నారు. మునుగోడు నియోజకవర్గ వెనుకబాటుకు కారణం గత పాలకులే కారణమని ఆయన అన్నారు.
గత ఎర్రజెండా చరిత్రను పునరావృతం చేయాలి: సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి
పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడే ఎర్రజెండ చరిత్రను పునరావృతం చేయడానికి కార్మికులు కర్షకులు నడుం బిగించి భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో ఎర్రజెండా కు పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా కార్యకర్తలు గ్రామ గ్రామాన ఎర్రజెండా చేసిన పోరాటాలను ప్రజలకు వివరించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైతంగ సాహిత పోరాటంలో కమ్యూనిస్టులు వీరవచిత పోరాటాలు చేశారని ఆయన గుర్తు చేశారు. భూమికోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం జరిగిన రైతాంగ సాయుధ పోరాటంలో ఎంతోమంది కమ్యూనిస్టులు ప్రాణాలను అర్పించారని అన్నారు. గత పార్లమెంట్  ఎన్నికల్లో నవభారత నిర్మాత జవహర్లాల్ నెహ్రూ కంటే అత్యధిక ఓట్లు సాధించి , గెలిచిన వ్యక్తి  రావి నారాయణరెడ్డి అని అన్నారు. అలాంటి ఘనమైన చరిత్ర కలిగిన ఈ ప్రాంతం లో కమ్యూనిస్టుల పాత్ర ఏందో ప్రజలందరికీ తెలుసు అని అన్నారు. నిత్యం ప్రజా సమస్యల కోసం పోరాడే పార్టీ ఒక  ఎర్రజెండానే అని అన్నారు. ఈ సమావేశం మండల సహాయ కార్యదర్శి వరుకుప్పల ముత్యాలు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం, డివైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు అయితగొని విజయ్, జిఎంపిఎస్ జిల్లా అధ్యక్షులు సాగర్ల మల్లేష్ , మునుగోడు నియోజకవర్గ  సోషల్ మీడియా బాధ్యులు జేరిపోతుల ధనంజయ గౌడ్, మండల కమిటీ సభ్యులు యాస రాణి శ్రీను, వేముల లింగస్వామి, వి హనుమయ్య, జి రాములు, లింగస్వామి, కాంతయ్య, దొండ వెంకన్న, ఎట్టయ్య, బొందు అంజయ్య, జిల్లా పెళ్లి యాదయ్య, కట్ట లింగస్వామి, బి నరసింహ, వై ఈరయ్య తదితరులు ఉన్నారు.
Spread the love