– బ్యారేజ్ కుంగడానికి నాణ్యత లోపమే కారణం : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్
నవతెలంగాణ- న్యూఢిిల్లీ బ్యూరో
కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించిన మేడిగడ్డ బ్యారేజ్ ప్రమాదానికి కేసీఆర్ కుటుంబమే కారణమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిలో మొదటి దోషి కల్వకుంట్ల కుటుంబమే అని ధ్వజమెత్తారు. నాణ్యత లోపం వల్ల మేడిగడ్డ ప్రమాదం జరిగిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని డొల్లతన, నిజస్వరూపం ఇప్పుడు బయటపడిందన్నారు. ఆదివారం నాడిక్కడ జరిగిన స్క్రీనింగ్ కమిటీ భేటీ తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కాళ్లేశ్వరం ప్రపంచంలోనే అద్భుతం అని గొప్పలు చెప్పారు. రైతులు, ప్రజల్ని బస్సుల్లో తీసుకెళ్లి మరీ ఆ ప్రాజెక్ట్ ను చూపించారు. మరి పంప్ హౌజ్ లు మునిగినప్పుడు, కుంగినప్పుడు ప్రతిపక్షాలను వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు వరుదలు లేకుండానే బ్యారేజ్ బ్రిడ్జి కుంగింది. ఈ ప్రాజెక్ట్ పేరిట లక్ష కోట్లను కేసీఆర్, కాంట్రాక్టర్లు దోచుకున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ ఎప్పుడో చెప్పారు. కేసీఆర్ ఫ్యామిలీకి ఈ ప్రాజెక్ట్ ఏటీంఎం లా మారింది.’ అని అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం పై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. కేంద్ర హౌంమంత్రి, గవర్నర్, ఎన్నికల కమిషన్ మెడిగడ్డ పై విచారణకి ఆదేశించాలన్నారు. అలాగే కాళేశ్వరం పనులపై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలన్నారు. బ్యారేజ్ కుంగడం వెనక సంఘ విద్రోహక శక్తులు ఉన్నాయా, లేక మానవ తప్పిదం వల్ల ప్రమాదం జరిగిందా అన్న దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలన్నారు. మెడిగడ్డకు వెళ్లేందుకు ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామని చెప్పారు. కేటీఆర్, హరీష్ రావు తమతో కలిసి మేడిగడ్డకు రావాలని సవాల్ విసిరారు. అలాగే కేంద్ర హౌంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మేడిగడ్డలో పర్యటించాలన్నారు. ఈ బ్యారేజ్ ను ప్రయివేట్ కంపెనీలు నిర్మించాయని తమకు సంబంధం లేదని ప్రభుత్వం అనడం సరికాదన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని ఆరోపిస్తోన్న కేంద్రంలోని బీజేపి సర్కార్ ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు.
తెలంగాణ లో ప్రభుత్వం మారుతుంది
త్వరలో తెలంగాణలో ప్రభుత్వం మారనుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం మాజీ క్రికెటర్ అజారుద్దీన్ తో కలిసి ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ దర్గాను దర్శించుకున్నారు. ఈ సందర్బంగా దర్గాకు చాదర్ సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ఒక లౌకికవాదిగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మినవాడిగా దర్గాకు వచ్చానన్నారు. దేశంలోనే నిజాముద్దీన్ దర్గాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. హజ్రత్ నిజాముద్దీన్ దర్గాలో ఏది కోరుకుంటే అది జరుగుతుందని ప్రజలకు విశ్వాసం ఉందన్నారు. రాబోయే ఐదు రాష్ట్రాల్లో లౌకిక ప్రభుత్వాలు ఏర్పాటు కావాలని దర్గాలో ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా అందరికీ సంక్షేమం, అభివృద్ధి అందాలని కోరుకున్నట్లు వెల్లడించారు. హిందువులు-ముస్లింలు కలిసి ఉంటూ మతసామరస్యాన్ని కాపాడే విధంగా పరిపాలన అందించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందన్నారు. దేశ గొప్పతనాన్ని కాపాడే ప్రయత్నం రాహుల్ గాంధీ చేశారని, ఈ దిశలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారని గుర్తు చేశారు.
తెలంగాణ సొమ్మును గోదారిలో పోశారు: భట్టి
కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరిట కేసీఆర్ తెలంగాణ సొమ్మును గోదారిలో పోశారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ తెలంగాణ రాష్ట్రానికి పెద్ద గుదిబండగా మారబోతోందన్నారు. సాంకేతిక నిపుణులు, సలహాదారులు లేకుండా కేసీఆరే ప్లాన్ లు గీశారన్నారు. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతం అని కేసీఆర్, కేటీఆర్ లు పదే పదే చెప్పుకున్నారని గుర్తు చేశారు. మరి ఇప్పుడు నాణ్యతాలోపంతో బ్యారేజ్ బ్రిడ్జ్ కుంగిపోతే, ఈ డిజైన్ తానే రూపొందించానని ఎందుకు చెప్పుకోవడం లేదని ప్రశ్నించారు.కేసీఆర్ గీసీన రీడిజైనింగ్ వల్లే కాశేళ్వరం నష్టదాయకంగా మారిందన్నారు. బ్యారేజ్ కుంగడంపై తక్షణమే ఒక విచారణ కమిటీ వేసి, వాస్తవాలు ఏమిటో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.