కేసీఆర్‌ చుట్టూ ముండ్లు

KCR is surrounded– కోడ్‌ ముగియగానే నోటీసులు
– విచారణకు హాజరవుతారా ?
– కోర్టుకు వెళతారా ?
– బీఆర్‌ఎస్‌ వర్గాల్లో సమాలోచనలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ అధినేత కే.చంద్రశేఖర్‌రావుకు ప్రస్తుత రాజకీయ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. ఒకవైపు పార్టీ రోజురోజుకు బలహీనపడుతుండటం, మరోవైపు కేసులు ఆయన్ను చుట్టుముడుతుండటమే ఇందుకు మూలం. గత పదేండ్లుగా అపరిమిత అధికారాలను అనుభవించిన ఆయనకు ఇప్పుడు దిక్కు తోచడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉండటం, కేంద్రంలో మోడీ సర్కారు ఏకంగా తన కూతుర్నే జైల్లో పెట్టడంతో కేసీఆర్‌ డిఫెన్స్‌లో పడిపోయారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీఆర్‌ఎస్‌ భవిష్యత్‌ను తేల్చనున్నాయి. ఒకవేళ ఫలితాలు కొంతలో కొంతైనా అనుకూలంగా వచ్చినా తక్షణ భౌతిక పరిస్థితి మాత్రం మారే అవకాశాలు లేవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం దగ్గర నుంచి ఫోన్‌ ట్యాపింగ్‌, విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు, చేప పిల్లల పంపిణీ, హరితహారంలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలు కేసీఆర్‌ మెడకు చుట్టుకునే పరిస్థితులు అధికంగా కనిపిస్తున్నాయి. సీబీఐ, ఈడీ కేసులతో తన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గత రెండు నెలలుగా ఢిల్లీ తీహార్‌ జైల్లో ఉన్నారు. ఇప్పటివరకు ఆయన కనీసం పరామర్శకు కూడా వెళ్లలేని పరిస్థితుల్లో ఇరుక్కుపోయారు. కేటీఆర్‌, హరీశ్‌రావు బెయిల్‌ కోసం శతథా ప్రయత్నం చేస్తున్నా, పరిస్థితి నిరాశాజనకంగానే ఉంటున్నది. పార్లమెంటు ఎన్నికల కోడ్‌ ముగియగానే కేసీఆర్‌కు నోటీసుల పర్వం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా మూడు అంశాల్లో ఆయన్ను విచారణకు పిలవనున్నారని తెలిసింది. తక్షణం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం. సుందిళ్ల బ్యారేజీలు విఫలమైన నేపథ్యంలో ఆయనకు జస్టిస్‌ పినాకిని చంద్రఘోష్‌ కమిషన్‌ నోటీసులు ఇవ్వనుంది. కాకపోతే ఈనెలాఖరులోగా నోటీసులు జారీకానున్నాయని తెలిసింది. ముందుగా అధికారులు, ఇతరులను విచారణకు పిలిచి, ఆ తర్వాతే కాళేశ్వరం నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన కేసీఆర్‌కూ నోటీసు ఇచ్చే పరిస్థితి ఉందని బీఆర్‌ఎస్‌ నేతలే అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసు ఉన్నతాధికారులు, ఇతర సిబ్బందిని ప్రయివేటు సైన్యంలా వాడుకుంటూ ప్రతిపక్ష పార్టీలను, నేతలను టార్గెట్‌ చేశారనే ఆరోపణలు కేసీఆర్‌ ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్‌ను టీడీపీలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే అరెస్టయి జైల్లో కాలం గడుపుతున్న రాధాకిషన్‌రావు, ప్రవీణ్‌రావు, భుజంగరావు, తిరుపతన్న విచారణ సందర్భంగా కేసీఆర్‌ ఆదేశాల మేరకే తాము ఎస్‌ఐబీని అడ్డంపెట్టుకుని వ్యవహారాలను నడిపామని వాంగ్మూలం ఇచ్చారనే ప్రచారం జరుగుతున్నది. ఎస్‌ఐబీ చీఫ్‌గా పనిచేసి రాజీనామా చేసిన ప్రభాకర్‌రావును హైదరాబాద్‌కు రాకుండా అడ్డుకోవడానికే హరీశ్‌రావును అమెరికా పంపారని మంత్రి కోమటిరెడ్డి వెంకటర్‌రెడ్డి సైతం విమర్శించిన విషయం విదితమే. కాగా విద్యుత్‌ కొనుగోళ్ల అంశంలోనూ జస్టిస్‌ చల్లా నర్సింహ్మరెడ్డి కమిషన్‌ కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వనుందని అంటున్నారు. ఇందులో ట్రాన్స్‌కో మాజీ సీఎండీ ప్రభాకర్‌రావు కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయా కేసుల విషయంలో కేసీఆర్‌కు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు కేసీఆర్‌పై నేరుగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు కానప్పటికీ, విచారణకు పిలిస్తే హాజరవుతారా ? లేక ఆ నోటీసులపై కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటారా ? అనేది ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

Spread the love