ఘనంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలు

– మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్టు మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రత్యేక పూజలు, ప్రార్ధనలు జరపనున్నట్టు తెలిపారు. వికలాంగులకు వీల్‌ ఛైర్లు, ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్‌ పత్రాలు, రోగులకు పండ్ల పంపిణీ చేయడంతో పాటు వివిద సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. 70వ జన్మదినం సందర్భంగా 70 కిలోల భారీ కేక్‌ కట్‌ చేయనున్నట్టు తెలిపారు. కేసీఆర్‌ రాజకీయ ప్రస్థానం, ఉద్యమ నేపథ్యంలో రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని ఈ సందర్భంగా ప్రదర్శించనున్నట్టు వివరించారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్‌ బీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ బాధ్యులు తలసాని సాయి కిరణ్‌యాదవ్‌, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ రెడ్డి, సీనియర్‌ నాయకులు రావుల చంద్రశేఖర్‌ రెడ్డి, వికలాంగుల సంస్థ మాజీ చైర్మన్‌ వాసుదేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love