– జనగామలో సీపీఐ(ఎం) అభ్యర్థి మోకు కనకారెడ్డి నామినేషన్… భారీ ర్యాలీ..
నవతెలంగాణ-జనగామ
జనగామ నియోజకవర్గంలో సీపీఐ(ఎం) అభ్యర్థి మోకు కనకారెడ్డి నామినేషన్ వేశారు. పార్టీ కార్యాలయం నుంచి నెహ్రూ పార్కు, ఆర్టీసీ చౌరస్తా మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి అబ్బాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆముదాల మల్లారెడ్డి, సిద్దిపేట జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దాసరి కళావతి, జనగామ జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపితో కలిసి మోకు కనకారెడ్డి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా కనకారెడ్డి మాట్లాడుతూ.. ప్రశ్నించే గొంతుకను అసెంబ్లీకి పంపాలని ఓటర్లను కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో పనిచేసే సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించాలన్నారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ముగాస్తున్న బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్టుల ద్వారానే ప్రజా సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందన్నారు.