ఢిల్లీలో తీవ్ర నీటి కొరత.. కోర్టుకెక్కిన కేజ్రీవాల్

నవతెలంగాణ – ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో నీటి ఎద్దడి తీవ్రమైంది. ఎండలు భగ్గుమంటుండటంతో రోజువారీగా సరఫరా చేస్తున్న నీరు ప్రజలకు ఏమాత్రం సరిపోవడంలేదు. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వం ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పొరుగు రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అదనపు నీటిని అందించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.  ‘ఎండల వల్ల ఢిల్లీ నీటి అవసరాలు గణనీయంగా పెరిగాయి. దేశ రాజధాని దాహం తీర్చడం ప్రతి ఒక్కరి బాధ్యత’ అని పిటిషన్ లో కేజ్రీవాల్ ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీలో కొన్ని రోజులుగా నీటి సమస్య అధికమైంది. ముఖ్యంగా చాణక్యపురిలోని సంజయ్ క్యాంప్ ప్రాంతంతోపాటు గీతా కాలనీ, మరికొన్ని చోట్ల ప్రజలు నీరు లేక అల్లాడుతున్నారు. కనీసం ఒక్క బకెట్ నీరు దొరుకుతుందన్న ఆశతో నీళ్ల ట్యాంకర్ల వద్ద ఎండలోనే పడిగాపులు కాస్తున్నారు. కానీ అన్ని ప్రాంతాలకూ చాలినంత నీటి సరఫరా మాత్రం వుండడం లేదు. ఇదిలావుంచితే, నీటి వృథాను అరికట్టేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. కార్లు కడగడం లాంటివి చేసే వారికి రూ. 2 వేల చొప్పున జరిమానా విధించాలని నిర్ణయించింది. జరిమానాల వసూలు కోసం ఢిల్లీవ్యాప్తంగా 200 బృందాలను రంగంలోకి దింపింది.

Spread the love