ఆటోలో ప్రయాణం చేసిన కేటీఆర్..

నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న అనంతరం తెలంగాణ భవన్‌కు ఆటోలో ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. కాగా, రాహుల్ భారత్ జోడో అంటుంటే.. కాంగ్రెస్ మిత్రపక్షాలు రాహుల్‌ కా చోడో అంటున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీజేపీని, మోడీని ఎదుర్కోవాలి అంటే ప్రాంతీయంగా బలంగా ఉన్న నాయకులతోనే సాధ్యమన్నారు.  జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ… కేసీఆర్ బొండిక పిసకాలి.. బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి అని కొందరు మాట్లాడుతున్నారని మండి పడ్డారు. బీఆర్ఎస్‌ను ఎందుకు బొంద పెట్టాలి? తెలంగాణ తెచ్చినందుకా ? తెచ్చిన తెలంగాణలో పేదలని కడుపులో పెట్టుకొని చూసుకున్నందుకా? అంటూ నిలదీశారు. కాంగ్రెస్ – బీజేపీది ఫెవికాల్ బంధమన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయడం అంటే బీజేపీకి ఓటు వేసినట్లేనన్నారు. కాంగ్రెస్, బీజేపీ మంచి అవగాహనతో కలిసి పనిచేస్తున్నాయని ఫైర్‌ అయ్యారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఆదానిని తిట్టి.. అధికారంలోకి రాగానే దావోస్‌లో వెళ్లి ఒప్పందాలు చేసుకొని వచ్చారని నిప్పులు చెరిగారు.

Spread the love