– వ్యకాస రాష్ట్ర కమిటీ సభ్యుడు పొన్నెకంటి
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
ఉపాధి కూలీలకు రోజుకు 600 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు పొన్నెకంటి సంగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్ వద్ద గల తమ్మినేని సుబ్బయ్య భవన్లో శుక్రవారం వ్యకాస ఖమ్మం రూరల్ మండల కమిటీ సమావేశం కారుమంచి గురవయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో సంగయ్య మాట్లాడుతూ బిజెపి అధికారం చేపట్టాక ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు అనేక ఎత్తుగడలు అమలు చేశారన్నారు. ఉపాధి హామీ పథకానికి బడ్జెట్లో 2.64 లక్షల కోట్లు కేటాయించాల్సి ఉండగా తక్కువ మొత్తంలో నిధులు కేటాయించి పని దినాలు, వేతనం తగ్గించిందన్నారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా ఉపాధి పని చేస్తున్న కూలీలకు గౌరవ వేతనం ఇచ్చి, పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ప్రతాపనేని వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా నాయకులు ఉరడీ సుదర్శన్రెడ్డి, వ్యకాస మండల కార్యదర్శి వడ్లమూడి నాగేశ్వరరావు, మండల కమిటీ సభ్యులు కత్రం ఉపేందర్, యాదగిరి, గుంటి వెంకన్న, నాగయ్య, వెంకటేశ్వర్లు, తుమాటి నాగయ్య, చంద్రయ్య, పగిడిపల్లి వెంకట్రావు, సైదులు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.