– బీజేపీకి పోయే కాలం దగ్గర పడ్డది
– ముషీరాబాద్ సీపీఐ(ఎం) బైక్ర్యాలీలో మాజీ ఎంపీ పి మధు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కమ్యూనిస్టులు ఎక్కడున్నారు? వారి పనైపోయిందనే విమర్శకుల నోళ్లు మూయించేలా ముషీరాబాద్ సీపీఐ(ఎం) అభ్యర్థి ఎం దశరథ్ గెలుపును కాంక్షిస్తూ ఆదివారం భారీ బైక్ర్యాలీ జరిగింది. ర్యాలీ అనంతరం సీపీఐ(ఎం) నగర కార్యదర్శి ఎం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో రాజ్య సభ మాజీ సభ్యులు పి మధు మాట్లాడుతూ ప్రజల క్షేమం కోసం నిరంతరం పోరాడేది మార్క్సిస్టు పార్టీయేనని చెప్పారు. బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలు అవకాశవాదం, ఒంటెత్తుపోకడతో వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. దీన్ని ప్రజలు ఆమోదించరన్నారు. బీజేపీ మతోన్మాదంతో పాటు ప్రభుత్వ రంగాన్నంతా ప్రయివేట్ కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామంటూ గప్పాలకు పోయిన మోడీ.. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. బీజేపీకి పోయే కాలం దగ్గర పడ్డదని హెచ్చరించారు. గవర్నర్ల వ్యవహార శైలిపౖౖె సుప్రీం కోర్టు చివాట్లు పెట్టిందని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితిలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీతో మిలాఖత్ కావటమేంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థి దశరథ్తో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు అరుణజ్యోతి, నగర పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు ఎం శ్రీనివాస్, ఎం.మహేందర్, రాజన్న,ఎం వెంకటేశ్, నాగలక్ష్మి తదితర నాయకులు పాల్గొన్నారు.