– ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ నాయకులు
– సత్తుపల్లిలో ఘనంగా ‘సార్’ జయంతి వేడుక
నవతెలంగాణ – సత్తుపల్లి
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకను ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ ఆధ్వర్యంలో గురువారం సత్తుపల్లిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక జవహర్ నగర్ లోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్. కేశవరెడ్డి, ఏఎస్ ప్రకాశరావు జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి ఆయన అందించిన సిద్ధాంత బలం చిరస్మరణీయమన్నారు. ఆత్మగౌరవం, హక్కులు, తెలంగాణ అభివృద్ధి కోసం జయశంకర్ సార్ జీవితాంతం అవిశ్రాంతంగా కృషి చేశారని కొనియాడారు. పదవుల కంటే తెలంగాణ సమాజ సంక్షేమానికే ఆయన ప్రాధాన్యమిచ్చారని ఈ సందర్భంగా కొనియాడారు.
ఆయన నిరాడంబర జీవనం, నిష్కళ్మష వ్యక్తిత్వం, అంకితభావం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. జయశంకర్ సార్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల హృదయాల్లో మహోన్నత వ్యక్తిగా చిరస్మరణీయుడిగా జయశంకర్ సార్ నిలిచిపోయారన్నారు. ఆయన చూపిన సిద్ధాంతపరమైన మార్గదర్శకం భావితరాలకు నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు రామిశెట్టి సుబ్బారావు, దొడ్డా కృష్ణయ్య, బొల్లేపల్లి మధుసూదన రాజు, సాంబశివరెడ్డి పాల్గొన్నారు.



