– బీజేపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి
– ఖమ్మం నగరంలో అమరవీరుల స్తూపాలకు నివాళి
– మోటార్ సైకిల్ర్యాలీ
– భక్త రామదాసు కళాక్షేత్రంలో జరిగే సభను జయప్రదం చేయండి
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మం
తెలంగాణ ప్రాంతంలో నైజాం రజాకార్లకు జాగీర్దారులుగా ఉంటూ ప్రజలను దోచుకున్న చిత్ర హింసలకు గురి చేసిన దొరలు, పటేల్, పట్వారిలకు వ్యతిరేకంగా సాగిన మహౌన్నతమైన పోరాటమే వీర తెలంగాణ సాయుధ పోరాటమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. గురువారం నాడు ఖమ్మం నగరంలోని నాటి వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు బోడేపుడి వెంకటేశ్వరరావు, వట్టి కొండ కాంతయ్య, క్యమ ముత్యాలు, యర్రా అప్పారావు స్తూపాలకు మోటార్ సైకిల్ ర్యాలీ ద్వారా వెళ్లి నివాళులర్పించారు. అదే విధంగా విద్యుత్ ఉద్యమ పోరాటయోధుడు సత్తెనపల్లి రామకృష్ణ, పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబోయిన లింగయ్య స్థూపాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అమరవీరుల స్థూపాలకు నివాళులర్పిస్తూ నగరం పలు వీధులు గుండా మోటార్ సైకిల్ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమాల్లో నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ వీర తెలంగాణ సాయిధ రైతాంగ పోరాట వారసత్వాన్ని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. ఈనెల 16వ తేదీన భక్త రామదాసు కళాక్షేత్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సభను నిర్వహించనున్నట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమవుతుందని పార్టీ సభ్యులు, సానుభూతిపరులు, ఖమ్మం నగర పుర ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై విక్రం, జిల్లా కమిటీ సభ్యులు యర్రా శ్రీనివాస్, ఎంఏ జబ్బార్, ఎస్ నవీన్రెడ్డి, దొంగల తిరుపతిరావు, రైతు సంఘం జిల్లా నాయకులు ఎస్కె విఏ మీరా సాహెబ్, త్రీ టౌన్ కార్యదర్శి భూక్య శ్రీను, టూ టౌన్ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్, అర్బన్ మండల కార్యదర్శి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
అమరవీరుల స్ఫూర్తితో పోరాటాలు నిర్వహించాలి
ఎర్రుపాలెం : తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా ఎర్రుపాలెం మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంనందు అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి వీరయ్య, నాయకులు గొల్లపూడి కోటేశ్వర రావు, గౌరరాజు రాములు, ఎడ్లపల్లి కాళేశ్వరరావు, గామసు జోగయ్య, కూడలి నాగేశ్వరరావు, తాళ్లూరి వెంకట నా రాయణ, చిత్తారు కిషోర్ పాల్గొన్నారు.