నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మున్సిపల్ శాఖ అప్పుల కోసం తిప్పలుపడుతోంది. అభివృద్ధి జరగాలంటే అప్పులు చేయని దుస్ధితి ఏర్పడింది. ఇప్పటికే వివిధ పథకాల కింద రుణాలు తెచ్చింది. మళ్లీ అప్పులు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఒకవైపు నగరాలు, పట్టణాల్లో రోజు రోజుకు జనాభా పెరుగుతున్నది. దీంతో పట్టణాల విస్తరణ వేగం పెరిగింది. అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత పురపాలికలపై ఉన్నది. నాణ్యమైన రహదారులు, డ్రయినేజీ వ్యవస్థ, వీధిలైట్లు, పార్కులు, నీటి వసతి, రవాణా ఇలా అనేక సౌకర్యాలు కల్పించాలి ఇవన్నీ చేసేందుకు నిధులు అవసరం. కానీ పెరుగుతున్న జనాభాకు కావాల్సిన సౌకర్యాలు కల్పించేందుకు సరిపడిన నిధులు బడ్జెట్లో కేటాయించడం లేదు. నగరాలు, పట్టణాలు ఆర్థిక సమృద్ధి సాధించలేక అప్పుల కోసం అర్రులు చాస్తున్నాయి. అన్ని కార్పొరేషన్లు ఆర్థిక స్వయం సమృద్ధి సాధించలేక డీలాపడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే లక్షల కోట్లు అప్పులు చేస్తున్నట్టుగానే ఆ తాకిడి మున్సిపల్ శాఖకు తగిలింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు తగిన నిధులు ఇవ్వకపోగా, రాష్ట్రాల్లో అప్పులను ప్రోత్సహిస్తున్నది. వారం రోజుల క్రితం అన్ని రాష్ర్టాల మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వర్క్షాప్ నిర్వహించింది. అర్బన్ చాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్)పై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. రుణం పొందడమెలా? అనే అంశంపై అధికారులకు అవగాహన కల్పించింది. అందులో భాగంగా యూసీఎఫ్ కింద ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకొనేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం, కేంద్రం 25 శాతం, రుణం 50 శాతం లెక్కన వందశాతం నిధులను సేకరించాల్సి ఉంటుంది. తద్వారా వరంగల్, కరీంనగర్, ఖమ్మం కార్పొ రేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్రం సూచించింది. అందుకనుగుణంగా మున్సిపల్ శాఖ ప్రణాళికలు రూపొందించడంలో తలమునకలైంది. ఇప్పటికే ఆ మూడు కార్పొరేషన్లలో ప్రధానంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రాథమిక నివేదికను కేంద్రానికి అందజేసింది. కేంద్రం కూడా అందుకు ఓకే చెప్పేసింది. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు రుణాన్ని పొందేందుకు తీసుకోవాల్సిన ప్లాన్పై మున్సిపల్ శాఖ కసరత్తు చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంక్ ఖాతా తెరవాలి. అందులో ఇటు కేంద్రం వాటా, అటు రాష్ట్రం వాటా అకౌంట్లో జమ చేయాలి. ఆ తర్వాతనే బ్యాంకు రుణం ఇస్తుంది. మున్సిపల్ శాఖ రూ.10,000 కోట్ల రుణం పొందేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఆ సొమ్ముతో వరంగల్, కరీంనగర్, ఖమ్మం కార్పొరేషన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అందుగానూ కేంద్రం రూ. 1,420 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో అండర్ గ్రౌండ్ డ్రయినేజీ వ్యవస్థను పెద్ద ఎత్తున చేపట్టేందుకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. అందుకు రూ. 4,674 కోట్లు అంచనా వేసింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రహదారుల అభివృద్ధి, విస్తరణ, స్కైవాక్, పుట్ ఓవర్ బ్రిడ్జిల పనుల కోసం రూ. 480 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. ముఖ్యంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ వేగంగా విస్తరిస్తోంది. అందుకు రూ.166 కోట్లు ఖర్చు చేయనుంది. భారీ వర్షాలకు నగరం అల్లకల్లోలం అవుతున్నది. రివర్ ఫ్రంట్ డెవలంప్మెంట్, చెత్త నిర్వహణ, డ్రయినేజీ, జంక్షన్లు, రోడ్లతో పాటు కారిడార్ కనెక్టివిటీని పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేంసిది.
అప్పు కోసం తిప్పలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



