నవతెలంగాణ-హైదరాబాద్: ఈనెల 16న మహిళ రిజర్వేషన్ బిల్లుతో పాటు పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. దేశంలోని ఆయా రాష్ట్రాల లోక్ సభ స్థానాల సంఖ్యలో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా తెలంగాణ లోక్ సభ స్థానాల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతమున్న వాటిని విభజించి కొత్తగా మరో 9 లేదా 10 లోక్సభ స్థానాలు ఏర్పాటు చేస్తారని అంచనా. దీంతో తెలంగాణ లోక్సభ నియోజకవర్గాల సంఖ్య 17 నుంచి 26 లేదా 27కు పెరగనుంది. పునర్విభజనకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. దీంతో జనాభా అధికంగా ఉన్నా ఆయా జిల్లాల్లో లోక్ సభ స్థానాలు పెరగనున్నాయి. అత్యధికంగా రంగారెడ్డి ఉమ్మడి జిల్లా 52,96,741 జనాభాతో రాష్ట్రంలో మొదటిస్థానంలో, దేశంలో 17వ ర్యాంకులో ఉంది.
అదే విధంగా పార్లమెంట్ స్థానాల్లో మహిళలకు 33శాతం కల్పించే బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపనుంది. తెలంగాణ మహిళలకు కేటాయంచే స్థానాలు పెరగనున్నాయి.ప్రస్తుతం తెలంగాణ నుంచి లోక్సభలో ఇద్దరు మహిళా ఎంపీలు డీకే అరుణ, కడియం కావ్య మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 9 మంది మహిళలు తెలంగాణ తరఫున లోక్సభలో అడుగుపెట్టనున్నారు. ప్రస్తుత బిల్లు ఆమోదం పొందితే 2029 ఎన్నికల్లో కచ్చితంగా ప్రతి పార్టీ వారికి 9 టికెట్లు ఇవ్వాల్సిందే. 2024 ఎన్నికల్లో అన్ని లోక్సభ స్థానాలకు కలిపి 12,459 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. వారిలో 8,360 మంది చివరికి బరిలో నిలిచారు. వీరిలో మహిళలు 800(9.6%) మంది మాత్రమే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో 33 శాతానికి వారి వాటా పెరగనుంది. దేశవ్యాప్తంగా 47.63 కోట్ల మంది మహిళా ఓటర్లున్నారు.



