మహిళా శక్తి కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలి…

– యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే….
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
మహిళా శక్తి” కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జండగే అధికారులకు సూచించారు. శుక్రవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో సెర్ప్, స్త్రీనిధి సిబ్బందికి మహిళా శక్తి కార్యక్రమం అమలుపై జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఆడబిడ్డలను ఆర్థికంగా శక్తిమంతులను చేసి వారిని కోటీశ్వరులను చేయడమే మహిళా శక్తి పథకం ముఖ్య ఉద్దేశమని, ఈ పథకాన్ని జిల్లాలో దిగ్విజయంగా నెరవేర్చాలని సూచించారు. స్వయం సహాయ సంఘాల ద్వారా పలు రకాల సూక్ష్మ పరిశ్రమలు, వ్యాపారాలను ప్రోత్సహించి సంఘాలలో సభ్యులుగా ఉన్న మహిళల ఆర్థిక స్వావలంబనకు సహకరించడం, మహిళల సామాజిక భద్రత కోణంలో సంఘాలను బలోపేతం చేయడం మహిళా శక్తి పథకం ప్రధాన  ఉద్దేశాలని అన్నారు. సూక్ష్మ తరహా పరిశ్రమలను గుర్తించి, అందులో సంఘాలను ప్రోత్సహించడం, ఆయా సంఘాలలో మహిళలు తమ నైపుణ్యాలకు తగ్గ ఉత్పత్తులను ఎంచుకుని, ఆ ఉత్పత్తులకు అవసరమైన నైపుణ్యాన్ని అందించడం, ఉత్పత్తికి అవసరమైన ఆర్థిక సహకారం కోసం బ్యాంక్ లింకేజీల సదుపాయం కల్పించడం, ఉత్పత్తి అయిన సరుకులు మార్కెటింగ్ కు అవసరమైన ప్రణాళికలు, సహకారం అందివ్వడం మహిళాశక్తి పథకంలో భాగమని తెలిపారు. మహిళా శక్తి పథకంలో జిల్లాలో 2024- 25 సంవత్సరానికి 16 వేల మంది మహిళా సంఘాల సభ్యులకు 87 కోట్ల రూపాయల విలువ గల కార్యాచరణ ప్రణాళికను చేపట్టడం జరుగుతుందని, మైక్రో ఎంటర్ప్రైజెస్,  పర్మనెంట్ స్టిచింగ్ సెంటర్లు, పాడి గేదెల పెంపకం, మొబైల్ ఫిష్ అవుట్ లెట్, పాల డైరీల ప్రోత్సాహం,  మీసేవ కేంద్రాలు, మహిళా శక్తి క్యాంటీన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, వ్యవసాయ అనుబంధ పరికరాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ లు తదితర 16 రకాల జీవనోపాదులు ఇందులో భాగమని తెలిపారు. మహిళల ఆర్థిక శక్తిని బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా శక్తి పథకం చాలా మంచి కార్యక్రమమని, ఈ పథకాన్ని జిల్లాలో దిగ్విజయంగా అమలు చేసి ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని సూచించారు చిరు వ్యాపారులను ప్రోత్సహించాలని వారికి అవగాహన కార్యక్రమాలు చేపట్టి అండగా నిలబడాలని తెలియజేస్తూ మహిళా శక్తి పథకానికి సంబంధించి లబ్ధిదారులను నిర్ణీత సమయంలోగా  గుర్తించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎంఎ కృష్ణన్,  జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, అడిషనల్ డిఆర్డిఓ శ్రీనివాస్, డీపీఎంలు, ఏపీఎంలు, సెర్ప్, స్త్రీనిధి సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love