సుభాష్ చంద్రబోస్ ఏమయ్యారనేది తెలియకపోవడం అవమానకరం: మమతా బెనర్జీ

నవతెలంగాణ- హైదరాబాద్: నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యమై దశాబ్దాలు గడుస్తున్నా.. ఆయనకు ఏమైందనే విషయం ఇప్పటికీ తెలియకపోవడం అవమానకరమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. నేతాజీ 127వ జయంతి సందర్భంగా కోల్‌కతాలోని ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దీదీ మాట్లాడుతూ… నేతాజీ మరణించిన తేదీ ఇప్పటికీ ప్రజలకు తెలియకపోవడం దేశానికే సిగ్గుచేటు అన్నారు. బోస్ అదృశ్యంపై దర్యాఫ్తు చేస్తామని బీజేపీ చెప్పిందని… కానీ అధికారంలోకి వచ్చి పదేళ్లయినా ఆ హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఒక పూట సెలవు ప్రకటించడాన్ని దీదీ ప్రస్తావిస్తూ… ఈ రోజుల్లో రాజకీయ కార్యక్రమాలకు సెలవు ప్రకటిస్తున్నారని, కానీ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన నేతాజీ వంటి వారికి మాత్రం సెలవు లేదని విమర్శించారు. నేతాజీ జయంతి రోజున జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని ఏళ్లుగా పోరాటం చేసినా ఫలితం లేదన్నారు.

Spread the love