నవతెలంగాణ – సత్తుపల్లి
డిస్ట్రిక్ట్ హ్యాండ్బుక్ సెన్సెస్-2027 తయారీపై సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో పలు శాఖలకు చెందిన మండల స్థాయి అధికారుల సమావేశం బుధవారం జరిగింది. మున్సిపల్ కమిషనర్ కోండ్ర నరసింహ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, ఆయా శాఖలకు సంబంధించిన సమగ్ర వివరాలను రెండు రోజుల్లోగా మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని సమావేశం తీర్మానించింది. ముఖ్యంగా విద్య, వైద్యం, బ్యాంకింగ్ వంటి కీలక రంగాల సమాచారాన్ని త్వరగా క్రోడీకరించాలని కమిషనర్ నరసింహ సూచించారు.
సమాచారాన్ని సకాలంలో అందించి హ్యాండ్బుక్ రూపకల్పనను విజయవంతం చేసే క్రమంలో అన్ని శాఖల అధికారులు పూర్తి సహకారాన్ని అందించాలని కమిషనర్ నరసింహ ఆయా శాఖల అధికారులను కోరారు. ఈ సమావేశంలో తహసీల్దార్ పున్నం సత్యనారాయణ, మండల విద్యాశాఖ అధికారి నక్కా రాజేశ్వరరావు, మండల వైద్యాధికారి డాక్టర్ రామిశెట్టి అవినాష్, ట్రాన్స్కో ఏఈ ఉబ్బన శరత్ బాబు, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి. సురేష్ నారాయణన్, మున్సిపల్ మేనేజర్ మైసా శ్రీనివాసరావు, హెచ్డబ్ల్యూఓలు దుర్గయ్య, మల్లికార్జున్, సతీష్, డీసీసీబీ కిరణ్ రెడ్డి, పశు వైద్యాధికారి ఎం. రమేష్, ఇరిగేషన్ ఏఈలు మహేష్, ఉపేంద్రమ్మ పాల్గొన్నారు.



