– గంగారం దాసరి ‘మధుబాబు’ స్వభావం అదే
– సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్
– ఘనంగా వైస్ ఎంపీపీ దాసరి వెంకటరామిరెడ్డి (చిట్టినాయన) 77వ జన్మదిన వేడుకలు
– జన్మదినాన రూ.12 లక్షల విలువగల సేవా కార్యక్రమాలు వితరణ
నవతెలంగాణ-సత్తుపల్లి
“అందరూ బాగుండాలి… అందులో నేనుండాలి” అనే గొప్ప స్వభావం కలిగిన వ్యక్తి దాసరి మధుమోహనరెడ్డి (మధుబాబు) అని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ కొనియాడారు. మధుబాబు తండ్రి, సత్తుపల్లి వైస్ ఎంపీపీ దాసరి వెంకటరామిరెడ్డి (చిట్టినాయన) 77వ జన్మదిన వేడుకలను గంగారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ఎమ్మెల్యే రాగమయి దయానంద్తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్ మాట్లాడారు.
గంగారం గ్రామానికి మధుబాబు సేవలు అనన్యమన్నారు. చిట్టినాయన తనయుడిగా మధుబాబు గంగారం గ్రామంలో జన్మించడం ఈ గ్రామ ప్రజల అదృష్టమని అన్నారు. ఆయన గ్రామానికి చేస్తున్న సేవలు రోజంతా చెప్పినా సరిపోవని కొనియాడారు. బడులు, గుడులు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాళ్లు, కరెంటు స్తంభాల ఏర్పాటు, వీధిలైట్లు, బస్ షెల్టర్ నిర్మాణం, గ్రామం మొత్తం సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం వంటి ఎన్నో పనులు చేశారన్నారు. అంతేకాకుండా గ్రామపంచాయతీకి సుమారు రూ. 50 లక్షలకు పైగా వ్యయంతో ఇంటిగ్రేటెడ్ గ్రామపంచాయతీ భవన నిర్మాణం కూడా చేపడుతున్నారని, ఇలా ఆయన సేవల గురించి చెప్పుకుంటూ పోతే పేజీలు సరిపోవని ఎమ్మెల్యే ప్రశంసించారు.
చిట్టినాయన జన్మదిన రూ. 12 లక్షల విలువ గల వితరణలు ఇవే
చిట్టినాయన జన్మదిన సందర్భంగా ఆయన కుమారుడు మధుబాబు రూ. 12 లక్షల విలువగల వితరణలో అందించారు. వీటిలో ట్రాక్టర్ ఇంజిన్తో కూడిన వాటర్ ట్యాంకర్, విద్యార్థుల కోసం 25 డెస్క్-బెంచీలు, ప్రతి తరగతి గదికి సరికొత్త బ్లాక్బోర్డులు, పాఠశాల భవనానికి రంగులు (పెయింటింగ్) తదితర అభివృద్ధి పనులు చేయించి ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్ దంపతుల చేతుల మీదుగా అందజేశారు. సేవా కార్యక్రమాల్లో దాసరి వెంకటరామిరెడ్డి కుటుంబం ఎప్పుడూ ముందుంటుందని, చిన్న వయసులోనే మధుమోహనరెడ్డి ప్రజాసేవలో చూపుతున్న చొరవ నేటి యువతకు ఆదర్శమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫాంలు, నాణ్యమైన మధ్యాహ్న భోజనంతో పాటు, త్వరలోనే 25 రకాల వస్తువులతో కూడిన ‘స్కూల్ కిట్లు’ అందజేయనున్నట్లు చెప్పారు. తల్లిదండ్రులు ఈ సదుపాయాలను వినియోగించుకుని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఆమె సూచించారు.
అనంతరం చిట్టినాయన జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ను ఎమ్మెల్యే కట్ చేసి, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాకర్ల రేవతి, ఎంఈఓ నక్కా రాజేశ్వరరావు, హెచ్ఎం నాగమణి, సత్తుపల్లి పాత సెంటర్ హెచ్ఎం శైలకుమారి, ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భీమిరెడ్డి సుబ్బారెడ్డి, హెచ్ఎంలు, గంగారం గ్రామ కాంగ్రెస్ నాయకులు కోలగట్ల చెన్నకేశవరావు, కావేటి అప్పారావు, ఊకే రమేషు, బండారు మారేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.



