భూమధ్య రేఖ మీద
మానవత్వం నీడను కొలుస్తున్నారు
నిజం నడిచే దారికి
నిఘా కెమెరాలే దిక్సూచులయ్యాయి
స్వేచ్ఛ ఇప్పుడు
గొంతుకు వేసిన అదృశ్య గొలుసు
న్యాయం
చట్ట పుస్తకాల్లోనే చిరునామా వెతుకుతోంది
అధర్మం
అధికార కుర్చీలో చిరునవ్వు నవ్వుతోంది
మాటలన్నీ పక్షులే…
కానీ రెక్కలు కత్తిరించుకుంది ఆకాశం
మనిషి విలువను
మనసుతో కాదు.. మార్కెట్తో కొలుస్తున్నారు
ఆకలి అన్నం కోసం కాదు..
ఆత్మగౌరవం కోసం ఏడుస్తోంది
యుద్ధాలన్నీ సరిహద్దుల్లోనే కావు…
ప్రతి ఇంటి గుండెలోనూ …..
నిశ్శబ్దం భయాల వారసత్వమై
జాతీయగీతంగా మారిపోయింది
భూమి తన అక్షంపై తిరుగుతుంటే
మనిషి అహంకారపు చక్రంలో తిరుగుతున్నాడు
చరిత్ర ప్రతిరోజూ…
రక్తంతో కొత్త పేజీ రాస్తోంది
ఈ భూమధ్య దృశ్యంలో
దిక్కులు మారలేదు…
మనిషే మారిపోయాడు
అందుకే భూమి ఇంకా తిరుగుతోంది గానీ
ధర్మం తన మార్గాన్ని ఇంకా వెతుకుతోంది.
డా.కటుకోఝ్వల రమేష్,
9949083327
భూమధ్య దృశ్యం
- Advertisement -
- Advertisement -


