ఎమ్మెల్యే చెంప పగులగొట్టిన మహిళ

నవతెలంగాణ – హరియాణా
హరియాణాలో అసాధారణ వర్షాలు, వరదలతో సతమతమవుతున్న ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జననాయక్ జనతా పార్టీ ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్‌పై ఓ మహిళ చేయి చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవల కురుసిన వర్షాలకు ఘగ్గర్ నదిపై ఉన్న చిన్న డ్యామ్‌ దెబ్బతినడంతో ఘులా ప్రాంతాన్ని వరద ముంచెత్తింది. పరీస్థితిని సమీక్షించేందుకు ఎమ్మెల్యే బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ అవస్థలు చెప్పుకునేందుకు ఎమ్మెల్యేను చూట్టుముట్టారు. తమ దీనస్థితికి ఎమ్మెల్యే నిర్లక్ష్యమే కారణమంటూ మండిపడ్డారు. ఇంతలో ఓ మహిళ అకస్మాత్తుగా ముందుకు దూసుకొచ్చింది. ‘ఇప్పుడెందుకు వచ్చావ్’ అని ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన చెంప ఛెళ్లుమనిపించింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎమ్మెల్యే చుట్టూ రక్షణగా నిలిచారు. కాగా, ఈ ఘటనపై ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్ స్పందించారు. ‘‘నేను తలుచుకుని ఉంటే డ్యామ్ దెబ్బతినేది కాదని ఆ మహిళ ఆరోపించింది. అది ఓ ప్రకృతి విపత్తని నచ్చజెప్పేందుకు నేను ప్రయత్నించా. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్న విషయాన్ని చెప్పా’’ అని ఆయన మీడియాతో పేర్కొన్నారు. ఆమెను తాను క్షమించానని, ఎటువంటి న్యాయపరమైన చర్యలు తీసుకోబోనని అన్నారు.

Spread the love