నేపాల్ కు అన్ని విధాలుగా అండగా ఉంటాం: మోడీ

నవతెలంగాణ- ఢిల్లీ: నేపాల్ ను భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపం కనీసం 128 మంది ప్రజల ప్రాణాలను హరించింది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా ఎన్నో ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఎంతో మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోడీ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా మోడీ స్పందిస్తూ… నేపాల్ లో భూకంపం కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధను కలిగిస్తోందని చెప్పారు. ఈ విషాదకర సమయంలో నేపాల్ కు అండగా ఇండియా ఉంటుందని… అన్ని రకాల సహాయ సహకారాలను నేపాల్ కు అందిస్తామని తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు నేపాల్ ప్రధానికి ట్యాగ్ చేశారు.

Spread the love