నవతెలంగాణ హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఉపవాస దీక్ష చేపట్టారు. దసరా వేడుకలకు దూరంగా ఉంటూ బేగంపేటలోని తన నివాసంలో ఆయన దీక్షకు దిగారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి జగన్ పై మండిపడ్డారు. “చంద్రబాబును అక్రమంగా నిర్బంధించి జైల్లో పెట్టారు. జైల్లో కిరాతకులుండాలి.. ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసినవాళ్లు కాదు. జగన్.. మీరు జైల్లో ఉండి వస్తే అందరూ జైలుకు పోవాలా? చంద్రబాబు అరెస్టుతో తెలుగు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆయనను మానసిక క్షోభకు గురిచేస్తుంటే తల్లడిల్లిపోతున్నారు. చంద్రబాబుకు బెయిల్ రాకుండా కుట్ర చేస్తున్నారు. జగన్ రాజ్యంలో ఎవరైనా సుఖంగా ఉన్నారా? రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది.” అని మోత్కుపల్లి అన్నారు.
“జగన్.. ఇక మీ ఆటలు సాగవు. మీ కుట్రలను ప్రజలు సాగనివ్వరు. మీ నాన్న పాలించినా ఇంత కుట్ర చేయలేదు. ప్రజలు జగన్ ఆటకట్టిస్తారు. డాక్టర్ సుధాకర్ను చంపిన పాపం జగన్దే. పేద ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఆయన దుర్మార్గంగా ఉపయోగించుకుంటున్నారు” అని మోత్కుపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను కడుపుమండి మాట్లాడుతున్నాను అని ఆవేదన వ్యక్తంచేశారు.