నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కంఠాలి గ్రామంలో గ్రామ సర్పంచ్ అధ్యక్షతన సోమవారం స్వచ్ఛ కామారెడ్డి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ పాల్గొన్నారని కార్యదర్శి తెలిపారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్వచ్ఛ కామారెడ్డి కార్యక్రమంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరు స్వచ్ఛత పాటించాలని అన్నారు.
వర్షాకాలం సమీపిస్తుందన్న గ్రామాలలో చెత్తాచెదారం ఎక్కడపడితే అక్కడ చెత్త వేయవద్దని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చిన డబ్బాలోనే తడి, పొడి చెత్తలను వేరు చేసి చెత్త బండిలో వేయాలని సూచించారు. అదేవిధంగా గ్రామాలలో ఖాళీ స్థలాలు ఇంటి ఆవరణలో మొక్కలను నాటాలని అన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా గ్రామాలలో శానిటైజేషన్ పనులు నిర్వహిస్తూ పరిశీలన చేయాలని జిపి కార్యదర్శికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, జిపి కార్యవర్గ సభ్యులు, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు గొల్ల లక్ష్మి , మహిళా సంఘాల సభ్యులు, ఆశా కార్యకర్త, అంగన్వాడీ టీచర్, గ్రామ పెద్దలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.



