చేలల్లో పనిచేసే రైతు చేతులు రేపటి తరం అంతరిక్ష రాకెట్లను తీర్చిదిద్దగలవా అంటే ‘సాధ్యమే’ అని నిరూపించాడు మోర్తాల నరేందర్ రెడ్డి. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మాధాపురం అనే ఒక చిన్న గ్రామం నుంచి ప్రఖ్యాత ప్రయివేటు ఏరోస్పేస్ సంస్థ ‘ స్కైరూట్ ఏరోస్పేస్’ (Skyroot Aerospace) లో కీలకమైన యువ శాస్త్రవేత్తగా ఎదిగాడు. ఆ స్ఫూర్తిదాయక కధనం నేటి జోష్.
నరేందర్ రెడ్డిది పూర్తిగా వ్యవసాయ ఆధారిత కుటుంబం. తండ్రి మోర్తాల హనుమిరెడ్డి, తల్లి లక్ష్మి. పదో తరగతి వరకు స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్న ఆయనకు, డీఆర్డీఓలో సీనియర్ సైంటిస్ట్గా పనిచేస్తున్న తన మేనమామ మల్లు వెంకటరెడ్డిని చూసి సైన్స్, స్పేస్ రంగాలపై ఎంతో ఆసక్తి పెరిగింది. ఆ తపనతోనే బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత డీఆర్డీఓలో రెండేండ్ల పాటు జూనియర్ రీసెర్చ్ అసోసియేట్గా పనిచేశాడు. అక్కడే స్పేస్ రంగంలో పనిచేయడానికి కావాల్సిన విలువైన అనుభవాన్ని గడించాడు.
ప్రాథమిక విద్య నుంచి శాస్త్రవేత్తగా..
నరేందర్ రెడ్డి తన ప్రాథమిక విద్యనంతా మాధాపురంలోని ప్రభుత్వ పాఠశాలలోనే పూర్తి చేశారు. ఉన్నత చదువుల కోసం ఖమ్మం వెళ్లి అక్కడ బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.
మొదటి విజయం:
ఇంజినీరింగ్ పూర్తయ్యాక భారతదేశ అత్యున్నత రక్షణ పరిశోధనా సంస్థ అయిన డీఆర్డీఓలో (సాకేత్, హైదరాబాద్)లో రీసెర్చ్ అసోసియేట్గా ఎంపికయ్యారు. అక్కడ క్షిపణులు, డిఫెన్స్ టెక్నాలజీపై రెండేండ్లపాటు ప్రయోగాత్మక పరిశోధనలు చేసి ఎంతో అనుభవాన్ని సంపాదించారు.
‘స్కైరూట్ ఏరోస్పేస్’ లో ప్రత్యేక ముద్ర:
భారత ప్రభుత్వం ప్రయివేట్ రంగానికి అంతరిక్ష తలుపులు బార్లా తెరిచిన తర్వాత స్థాపించబడిన అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ ”స్కైరూట్ ఏరోస్పేస్”. ఇందులో సీనియర్ ప్రొపల్షన్ / టెస్టింగ్ ఇంజినీర్గా చేరిన నరేందర్ రెడ్డి అతి పిన్న వయసులోనే కీలక ప్రాజెక్టులకు నేతృత్వం వహించారు.
‘విక్రమ్-ూ’ చారిత్రాత్మక ప్రయోగం:
స్కైరూట్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దిన ‘విక్రమ్-1’ (మిషన్ ఆగమన్) ప్రయోగంలో నరేందర్ రెడ్డి 20 మంది సభ్యులున్న ‘ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్’ టీమ్కి లీడర్గా వ్యవహరించారు. రాకెట్ ల్యాంచ్ వెహికల్ భాగాలను అమర్చడం, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్, కఠినమైన పరీక్షలతో పాటు లాంచ్ ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించడంలో ఆయన పాత్ర అత్యంత కీలకమైనది.
భారతదేశంలోనే మొదటి ప్రయివేట్ రాకెట్ ‘విక్రమ్-1’ కు సంబంధించి ప్రొపల్షన్ సిస్టమ్స్ పరీక్షలు, సిస్టమ్స్ ఇంటిగ్రేషన్, గ్రౌండ్ టెస్టింగ్ పనులను నరేందర్ తన బృందంతో కలిసి రాత్రింబవళ్లు శ్రమించి పూర్తి చేశారు. ‘విక్రమ్-ఎస్’ (Vikram-S) ను ఇస్రో శ్రీహరికోట లాంచ్ ప్యాడ్ నుంచి విజయవంతంగా అంతరిక్షంలోకి పంపిన ప్రాజెక్టులో ఆయన ప్రొపల్షన్ భాగాల పర్యవేక్షణలో ముఖ్యభూమిక పోషించారు.
నరేందర్ రెడ్డి మాటల్లో..
ఈనాడు మన దేశంలో ప్రయివేట్ స్పేస్ రంగానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. గ్రామీణ విద్యార్థులు కేవలం సాఫ్ట్వేర్ చదువులకే పరిమితం కాకుండా ఏరోస్పేస్, రోబోటిక్స్, డిఫెన్స్, ర రంగాలపై కూడా దృష్టి పెట్టాలి. మనం గట్టిగా అనుకుంటే పల్లెటూరి బడి నుంచి అంతరిక్ష కేంద్రం వరకు దేనినైనా చేరుకోవచ్చు .
– అనంతోజు మోహన్కృష్ణ 88977 65417



