నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 క్రికెట్లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) చరిత్ర సృష్టించింది. టీ20ల్లో (ఐపీఎల్, సీఎల్టీ20తో సహా) అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ముంబై సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) తో జరిగిన మ్యాచులో విక్టరీతో ముంబై ఇప్పటివరకు సాధించిన విజయాల సంఖ్య 150కి చేరింది. దాంతో ఈ మైలురాయిని సాధించిన ప్రపంచంలోనే మొదటి జట్టుగా ఎంఐ అవతరించింది. ఈ ల్యాండ్మార్క్కు ఇంకా రెండు విజయాల దూరంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక నిన్నటి మ్యాచులో బంపర్ విక్టరీతో ఎట్టకేలకు ముంబై ఈ సీజన్లో తొలి గెలుపు రుచి చూసింది. మొదట ఆడిన 3 మ్యాచుల్లో వరుస పరాజయాలతో డీలా పడ్డ ముంబైకి ఈ విజయం ఊరటనిచ్చింది. హోమ్ గ్రౌండ్ వాంఖడేలో ముంబై ఇండియన్స్ ఈఎస్ఏ కార్యక్రమంలో భాగంగా వివిధ ఎన్జీఓల మద్దతుతో వచ్చిన 18 వేల మంది పిల్లల ముందు ‘మెన్ ఇన్ బ్లూ’ మొదట బ్యాటింగ్ చేసి 234 పరుగుల భారీ స్కోర్ సాధించడం విశేషం.