నవతెలంగాణ – రాంచీ: రాంచీలో జరుగుతున్న నాలుగవ టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ జట్టు 353 పరుగులకు ఆలౌటైంది. భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా తన ఖాతాలో నాలుగు వికెట్లు వేసుకున్నాడు. రెండో రోజు జడేజా చివరి మూడు వికెట్లను తీసుకున్నాడు. కేవలం ఆరు పరుగుల తేడాలోనే ఇంగ్లండ్ తన చివరి మూడు వికెట్లను కోల్పోయింది. తొలి రోజు ఇంగ్లండ్ ఏడు వికెట్ల నష్టానికి 302 రన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ 122 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. శుక్రవారం ఓ దశలో ఇంగ్లండ్ 112 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది. అయితే ఈ సిరీస్ ఆరంభంలో పెద్దగా ఆడలేకపోయిన జో రూట్ ఈ మ్యాచ్లో తన సత్తా చాటాడు. 274 బంతుల్లో అతను 122 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. ఆల్రౌండర్ ఓలీ రాబిన్సన్తో కలిసి 8 వికెట్కు కీలకమైన 103 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇవాళ ఉదయం ఇంగ్లండ్ తొలి సెషన్లో 51 పరుగులు చేసింది. ఇండియన్ బౌలర్లలో స్పినర్ జడేజా నాలుగు వికెట్లు తీసుకున్నాడు. రాజ్కోట్ సెకండ్ ఇన్నింగ్స్లో అయిదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్న జడ్డూ.. రాంచీలోనూ తన సామర్థ్యాన్ని నిరూపించాడు. స్పీడ్ బౌలర్ ఆకాశ్ దీప్ మూడు వికెట్లు తీసుకోగా, సిరాజ్ రెండు, అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నారు.